బీజేపీకి ఉన్న ఒకే స్థానం ఉండేనా.. ఊడేనా?

by Disha Web Desk 4 |
బీజేపీకి ఉన్న ఒకే స్థానం ఉండేనా.. ఊడేనా?
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పార్లమెంటు స్థానంలో ఏకైక ప్రాథమిక సహకార సంఘం గెల్చుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మున్సిపల్ అర్బన్‌లో పెద్దూరు‌లోని ఏకైక సింగిల్ విండో మహిళా చైర్మన్ బీజేపీ కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ స్థానానికి అవిశ్వాస ఛాయలు కమ్ముకున్నాయి.

పెద్దూరు ప్రాథమిక సహకార సంఘం మహిళా చైర్మన్ బర్కం లక్ష్మి నవీన్ యాదవ్ డైరెక్టర్‌కు ఇండిపెండెంట్‌గా గెలిచి అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఆఫర్లు ఇచ్చినా అన్ని కాదనుకొని బీజేపీ వైపు మొగ్గుచూపి ఏడుగురు డైరెక్టర్లతో చైర్మన్ అయ్యారు. బర్కం లక్ష్మీ నవీన్ యాదవ్ మంత్రి కేటీఆర్‌కు ముచ్చెమటలు పట్టించిన దాఖలాలు ఉన్నాయి.

భారీ పోలీస్ బలగాల మధ్య ఈ ఎన్నిక జరిగింది. రాష్ట్రం మొత్తం ఈ ఎన్నిక వైపే చూశారు. సిరిసిల్ల నియోజకవర్గం కేటీఆర్ చెప్పినా వినడం లేదంటే ఇంత బలమైన నేత ఎవరు అనే చర్చ సాగింది. చివరికి బర్కం లక్ష్మీ యాదవ్ మహిళా చైర్మన్‌గా ఎన్నిక అయ్యారు. పెద్దూర్ ప్రాథమిక సహకార సంఘంలో రాష్ట్రంలోనే ఏకైక మహిళా చైర్మన్‌గా బీజేపీ జెండా ఎగరవేశారు.

ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్‌లోనే ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకున్న స్థానమిది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల అర్బన్ పరిధిలో పెద్దూరు ఉంది. ఆ స్థానానికి ఇప్పుడు అవిశ్వాస ఛాయలు కమ్ముకున్నాయి. ఎన్నికలు జరిగి మూడు సంవత్సరాలు పూర్తి కావస్తున్నా మూడు సంవత్సరాలు దాటితే అవిశ్వాసం పెట్టే అవకాశాలు వుంటాయి. పెద్దూర్ సహకార సంఘం చైర్మన్‌ను బీఆర్ఎస్ కైవసం చేసుకునేందుకు మంత్రి కేటీఆర్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పార్లమెంట్ స్థానంలో గెలుపొందిన ఏకైక ప్రాథమిక సహకార సంఘం మహిళా చైర్మన్ పదవి చేజారి పోతుందా అనే చర్చ జోరందుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ రాష్ట్రంలోనే ఏకైక మహిళా చైర్మన్ స్థానాన్ని కాపాడుకోలేకపోతే రానున్న ఎన్నికల్లో ఎలా గెలిపించుకుంటాడనే టాక్ నడుస్తోంది.

మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల కొండగట్టులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ దేవుళ్లను ఎన్నికల కోసమే వాడుకుంటున్నారన్నారు. తర్వాత పట్టించుకోరని సీఎం కేసీఆర్ కొండగట్టుకు రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయించారని నిజమైన దైవ భక్తుడు కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీకి గ్రాఫ్ తగ్గిపోయిందని ఎద్దేవా చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విద్యుత్ సహకార సంఘం ఎలక్షన్లో డిసెంబర్ 24లో జరిగాయి. 15 స్థానాలకు బీజేపీ మద్దతుతో పోటీ చేసినా ఒక డైరెక్టర్ స్థానం కూడా కైవసం చేసుకోకపోవడంతో బీజేపీ గ్రాఫ్ తగ్గిందా అనే చర్చ జోరందుకుంది.

Next Story