అందగత్తెల కోసం షాపులు కూలుస్తారా? : బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి మండిపాటు

by Muthe.Rajitha |

అందగత్తెల కోసం రోడ్డు పక్కన పేద ప్రజల షాపులను కూలుస్తారా? అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు.

అందగత్తెల కోసం షాపులు కూలుస్తారా? : బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి మండిపాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో: అందగత్తెల కోసం రోడ్డు పక్కన పేద ప్రజల షాపులను కూలుస్తారా? అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కూల్చిన షాపుల చిరువ్యాపారులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. రేవంత్‌రెడ్డి ప్రజాపాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక మూలన కూల్చివేతలు రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని చెప్పారు. వరంగల్, నాగర్‌కర్నూల్‌లో రోడ్డు పక్కన ఉన్న పేదల షాపులను కూల్చారని ఆరోపించారు. ఓరుగల్లు చారిత్రక నగరమని, ఎవరి మెప్పుకోసం ప్రజలను ఏడుపిస్తున్నారని నిలదీశారు. అందగత్తెలతో రాష్ట్రానికి అందం వస్తుందా...? అందమైన పాలనతో రాష్ట్రానికి అందం వస్తుందన్నారు.

బుల్డోజర్ తీసుకువచ్చి కూలగొట్టడం ప్రజాపాలననా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కట్టడాల కంటే కూల్చివేతలు ఎక్కువ అవుతున్నాయన్నారు. హైడ్రా, మూసీ, లగచర్ల, హెచ్‌సీయూ, వరంగల్, నాగర్‌కర్నూల్‌లో పేదలపై దాడి చేస్తున్నారని ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్‌తో రాష్ట్రానికి రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అందాల పోటీలతో రాష్ట్రానికి ఒరిగేది ఏంటని ప్రశ్నించారు. అందాల పోటీలతో ప్రభుత్వం బిజీగా ఉందని, రైతుల పరిస్థితి ఏం కావాలన్నారు.

Next Story