బీజేపీలోకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. తెలంగాణలో నష్టం తప్పదా?

by Disha Web Desk 2 |
బీజేపీలోకి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. తెలంగాణలో నష్టం తప్పదా?
X

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణానంతరం కాంగ్రెస్ పార్టీ తొలుత రోశయ్య, అనంతరం కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం పీఠం ఎక్కించింది. అనంతరం తెలంగాణా విభజన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు అంటీముట్టనట్లు ఉంటున్న ఆయన తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే సమాచారం ఉంది. కాంగ్రెస్ పార్టీకి బద్ధశత్రువైన బీజేపీలో కిరణ్ కుమార్ ఇమడగలుగుతారా ? ఆయన చేరికతో కమలదళానికి ఏపీలో ఏమైనా లాభం చేకూరుతుందా? అనే విషయంపై ఒక్కసారి పరిశీలిద్దాం.

దిశ, తిరుపతి: ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలోనే బీజేపీ పార్టీలో చేరతారని మాత్రం ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయన చేరికతో పార్టీకి అదనంగా వచ్చే ప్రయోజనం ఏదైనా ఉంటుందా? అన్న చర్చ బీజేపీ జరుగుతుంది. కేవలం రెడ్డి సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకోవడానికి నల్లారి దగ్గర దారి అనుకున్న కమల దళం ఆయనను పార్టీలోకి తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కానీ రెండు రాష్ట్రాల్లో అది సాధ్యం అయ్యే పని కాదు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో బీజేపీకి అంతగా లాభం ఉండబోదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు నిర్వర్తించిన ఇమేజ్ ఓట్లుగా మలుస్తుందా ? అంటే నల్లారి గత పదేళ్లుగా ప్రజలకు ఎందుకు దూరమయ్యారన్న ప్రశ్న వెనువెంటనే వినిపిస్తోంది.

ఏం ఉపయోగం?

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకాశించే నేత కాదు. ఆయన నాయకత్వ లక్షణాలు కేవలం ఒక్క నియోజకవర్గానికే పరిమితం అని చెప్పుకోవాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పైరవీల కాంగ్రెస్ లో ఆయన అదృష్టవశాత్తూ ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి అప్పుడు కూడా కిరణ్ ఎంపిక సరైంది కాదన్నది పార్టీలో అనేక మంది అభిప్రాయం. తన జీవితంలో చూడలేని పదవిని అనుభవించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పని చేసే అవకాశం కల్పించిన కాంగ్రెస్ ను కష్టాల్లో వదిలేసి వేరే పార్టీ చూసుకోవడంతోనే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బలం బయటపడింది. ఆయన పీలేరు నియోజకవర్గానికి ఎక్కువ...చిత్తూరు జిల్లాకు తక్కువస్థాయి నేత అన్న సెటైర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

తెలంగాణలో అసలుకే మోసం

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సేవలను తెలంగాణలోనూ బీజేపీ ఉపయోగించుకోవాలని భావిస్తుందట. అదే జరిగితే అంతకు మించి నష్టం మరొకటి ఉండదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. ఏపీ విభజన సమయంలో నల్లారి వ్యవహారాన్ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. తెలంగాణలో ఆయన ఎంట్రీతో రెడ్డి సామాజికవర్గం ఓట్లను సంపాదించుకోవచ్చని బీజేపీ అధినాయకత్వం అంచనా వేసి ఉండవచ్చు. కానీ సాధ్యం కాదని, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల వైపు మాత్రమే తెలంగాణలో రెడ్డి సామాజికవర్గం మొగ్గు చూపుతుందని రాజకీయ ఉద్ధండుల మాట. కిరణ్ కుమార్ రెడ్డి.. వారి సామాజిక వర్గ నేతగా చూడటం లేదని అంటున్నారు. అలాంటప్పుడు అలాంటప్పుడు నల్లారితో బీజేపీకి కలిగే ప్రయోజనమేమిటనేది ప్రశ్నార్థకం.

రెడ్డి సామాజిక వర్గమూ దూరమే..

ఇక ఏపీలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వల్ల బీజేపీకి అదనంగా వచ్చే ప్రయోజనం లేదు. ఇక్కడ రెడ్డి సామాజికవర్గం ఓట్లు జగన్ వైపు ఉన్నాయి. అవి టర్న్ అయి నల్లారి వైపు రావడం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మాత్రం జరగదు. దీర్ఘకాలంలో చెప్పలేం కానీ ఇప్పటికిప్పుడు నల్లారి పార్టీలోకి వచ్చినా చేసేదేమీ లేదు. ఏపీలో బీజేపీకి అసలు ఓటు బ్యాంకే లేదు. నల్లారి వల్ల ఓట్లు పెరిగే అవకాశమూ ఎంత మాత్రం లేదు. ఎందుకంటే ఆయన లీడర్ కాదు. అధిష్టానం నిర్ణయించిన నాయకుడు మాత్రమే. అందుకే ఆయన చేరిక బీజేపీకి రెండు రాష్ట్రాల్లో లాభం కాకపోగా, నష్టం జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ పండితులు అంటున్నారు. సో.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలోకి ఎంట్రీ రాంగ్ టైమింగేనన్నది పలువురి అభిప్రాయం.

కిరణ్‌కు లాభమా? నష్టమా?

నల్లారి పదేళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి దూకాలని చూస్తున్నారు. అయితే కిరణ్ కుమార్ ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ హోదాలో పని చేసిన వ్యక్తి మళ్లీ క్షేత్ర స్థాయి నుంచి రాజకీయం చేయాలంటే కష్టమేనని ప్రజలు చర్చించుకుంటున్నారు. మరో వైపు బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కమలం కండువా కప్పుకోవడంతో కిరణ్ కు వచ్చే లాభమేమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

Next Story

Most Viewed