డ్రోన్లతో డ్రగ్స్..వెపెన్స్​.. సరిహద్దులు దాటి వస్తున్న మాదకద్రవ్యాలు

by Dishanational2 |
డ్రోన్లతో డ్రగ్స్..వెపెన్స్​.. సరిహద్దులు దాటి వస్తున్న మాదకద్రవ్యాలు
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : భారత్–పాక్​సరిహద్దుల్లో మన సైన్యానికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. పాక్​ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు తరచూ డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలు..మారణాయుధాలను మన దేశంలోకి పంపిస్తుండటం బోర్డర్​సెక్యూరిటీ ఫోర్స్​కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంత పకడ్భంధీగా నిఘా పెట్టినా ఎక్కడో ఒక చోటు నుంచి దేశం లోపలికి వస్తున్న డ్రగ్స్​యువతను మత్తుకు బానిసలుగా చేస్తున్నాయి. ఇక, సరిహద్దుల అవతలి నుంచి స్మగుల్​అవుతున్న మారణాయుధాలు అసాంఘిక శక్తుల చేతుల్లోకి చేరి తరచూ బుల్లెట్లు కక్కుతున్నాయి. గత ఒక్క సంవత్సరంలోనే సరిహద్దుల అవతలి నుంచి డ్రోన్ల ద్వారా వచ్చిన డ్రగ్స్​విలువ రెండువేల అయిదు వందల కోట్ల రూపాయలంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పట్టుబడుతున్న డ్రగ్స్​కంటే కనీసం నాలుగు రెట్లు దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చేరుతున్నాయని అధికారులే చెబుతున్నారు.

ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా..

పంజాబ్, రాజస్థాన్​రాష్ర్టాలకు సంబంధించి పాకిస్తాన్​బోర్డర్​ఉన్న ప్రాంతాల నుంచే ఎక్కువగా డ్రోన్ల ద్వారా డ్రగ్స్, అధునాతన మారణాయుధాలు మన దేశంలోకి వస్తున్నాయి. పంజాబ్​రాష్ర్టంలోని పఠాన్​కోట్, గురుదాస్​పూర్, అమృత్ సర్, తర్న్​తరేన్, ఫిరోజ్​పూర్, సజిల్కా, రాజస్థాన్​లోని గంగాపూర్ తదితర ప్రాంతాల్లో పాకిస్తాన్​ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా అధికంగా ఈ అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.

2,200 కోట్లకు పైగా విలువ చేసే డ్రగ్స్​..

అధికారిక లెక్కల ప్రకారం ఒక్క 2022లోనే బోర్డర్​సెక్యూరిటీ ఫోర్స్​సిబ్బంది భారత్–పాక్​సరిహద్దుల్లో ఇరవై రెండు డ్రోన్లను కూల్చివేశారు. వీటి నుంచి 317 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు చెబుతున్న ప్రకారం అంతర్జాతీయ మార్కెట్​లో దీని విలువ 2వేల రెండు వందల కోట్లకు పైగానే ఉంటుంది. ఇలా సరిహద్దులు దాటి వస్తున్న ఈ మాదకద్రవ్యాలు దేశం మొత్తం పంపిణీ అవుతున్నట్టు నార్కొటిక్​సెల్​కు చెందిన ఓ సీనియర్​అధికారి చెప్పారు. సెలబ్రిటీలతోపాటు విద్యార్థినీ, విద్యార్థులు, యువతీ, యువకులు వీటికి బానిసలుగా మారి ఇల్లు..ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారన్నారు. కొంతమంది డ్రగ్స్​మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్పడుతున్నట్టు వివరించారు.

అసాంఘిక శక్తుల చేతుల్లోకి ఆయుధాలు..

ఇక, డ్రోన్ల ద్వారా మన దేశంలోకి వస్తున్న అత్యాధునిక మారణాయుధాలు మాఫియా డాన్లు, కరడుగట్టిన గ్యాంగ్​స్టర్ల చేతుల్లోకి చేరుతున్నాయి. దాంతోపాటు నేర ప్రపంచంలోకి కొత్తగా వస్తున్న వారికి కూడా ఇవి అందుబాటులో ఉంటున్నాయి. వీటిని ఉపయోగిస్తూ మాఫియా డాన్లు, గ్యాంగ్​స్టర్లు చేస్తున్న నేరాలకు అంతు లేకుండా పోతోంది. దీనికి నిదర్శనంగా ఉత్తర ప్రదేశ్​లో హత్యకు గురైన అతీక్​ఉదంతాన్నే పేర్కొనవచ్చు. ప్రయాగ్​రాజ్​సీజేఎం కోర్టులో అతీక్​రిమాండ్​రిపోర్టును సమర్పించిన పోలీసులు అందులో లష్కర్​ఏ తొయిబా సంస్థ డ్రోన్ల ద్వారా అతీక్​కు అత్యంత అధునాతన ఆయుధాలను సమకూర్చినట్టు పేర్కొనటం గమనార్హం. గత ఏడాది బోర్డర్​సెక్యూరిటీ ఫోర్స్​పోలీసులు డ్రోన్లను కూల్చి వేసి డెబ్భయికి పైగా ఏకే 47 తదితర అధునాతన ఆయుధాలు, తొమ్మిది వందల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఎక్కువగా చైనా మేడ్...

ఇక, సరిహద్దుల్లో బోర్డర్​సెక్యూరిటీ ఫోర్స్​కూలుస్తున్న డ్రోన్లలో చైనా దేశంలో తయారైనవే ఎక్కువగా ఉంటున్నాయి. ఒక్కో డ్రోన్​ముప్పయి నుంచి యాభై కిలోల బరువును మోసుకెళ్లే కెపాసిటీని కలిగి ఉంటున్నాయి. కొన్నిసార్లు అమెరికా, చైనా దేశాల్లో తయారైన విడిభాగాలను అసెంబుల్​చేస్తూ పాక్​ప్రేరేపిత ఉగ్రవాదులు డ్రోన్లు తయారు చేసి మన దేశంలోకి డ్రగ్స్, మారణాయుధాలను పంపిస్తున్నారు.



Next Story

Most Viewed