ఎవ్వరు అడ్డొచ్చినా ‘మూసీ’ ప్రక్షాళన చేసి తీరుతాం: మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

ఎవ్వరు అడ్డొచ్చినా.. భావి తరాల కోసం ‘మూసీ’ ప్రక్షాళన చేసి తీరుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

ఎవ్వరు అడ్డొచ్చినా ‘మూసీ’ ప్రక్షాళన చేసి తీరుతాం: మంత్రి శ్రీధర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎవ్వరు అడ్డొచ్చినా.. భావి తరాల కోసం ‘మూసీ’ ప్రక్షాళన చేసి తీరుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవాళ ఇన్సిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లానర్స్ ఇండియా(ITPI) తెలంగాణ స్టేట్ రీజినల్ ఛాప్టర్ ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయాత్ హోటల్‌లో ‘పాలసీస్ అండ్ స్ట్రాటజీస్ టూవార్డ్స్ బయోఫిలిక్ అర్బనిజం’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సౌత్ జోన్ కాన్ఫరెన్స్‌ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణంగా ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొందరూ కావాలనే అడ్డుపడుతుంటారని కామెంట్ చేశారు. ప్రస్తుతం మూసీ ప్రక్షాళన విషయంలోనూ ఇదే జరుగుతోందని అన్నారు. కానీ, భావి తరాల కోసం ప్రక్షాళన చేసి తీరుతామని, ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. నీటి వనరుల పరిరక్షణలో ఇతర రాష్ట్రాలకు తెలంగాణను రోల్ మోడల్‌గా నిలుపుతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారుజ

నగరాల అభివృద్ధికి సరైన ప్రణాళికే పునాది అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పర్యావరణం, సుస్థిరత లేకుండా ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదని తెలిపారు. భవనాలను నిర్మించడమే అభివృద్ధి కాదని, ప్రస్తుత పరిస్థితుల్లో పర్యావరణ పరిరక్షణతో కూడిన వృద్ధి ఆవశ్యకమని అన్నారు. నేడు మనం రూపొందించే ప్రతి విధానం, కాపాడే ప్రతి అడవి, పునరుద్ధరించే ప్రతి నది, సృష్టించే ప్రతి జీవనోపాధి - ఇవన్నీ తరాల మధ్య న్యాయానికి సంకేతాలని వివరించారు. పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, కార్బన్ - న్యూట్రల్ గ్రోత్, జల సంరక్షణ, సుస్థిర రవాణాలో తెలంగాణ అవలంభిస్తున్న విధానాలు, తీసుకున్న చర్యలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని అన్నారు. సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటే సుస్థిరాభివృద్ధితో కూడిన నగరాలను అభివృద్ధి చేయవచ్చిన స్పష్టం చేశారు. వాతావరణ మార్పులు, పట్టణ వరదలు, పర్యావరణ కాలుష్యం, భూగర్భ జలాల తరుగుదల, పట్టణీకరణ, తరిగిపోతున్న పచ్చదనం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని నగర ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీపీఐ ప్రెసిడెంట్ ఎన్‌కే పటేల్, సెక్రటరీ జనరల్ కుల్ శ్రేష్ఠ, కో-ఆర్డినేటర్ (టెక్నో అడ్మిన్) ప్రదీప్ కుమార్, ఐటీపీఐ - తెలంగాణ రీజినల్ ఛాప్టర్ చైర్మన్ ఎస్.దేవేందర్ రెడ్డి, కార్యదర్శి కె.మురళీధర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story