ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరి రైతుబంధు డబ్బులిచ్చాం : Harish Rao

by Rajesh |
ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరి రైతుబంధు డబ్బులిచ్చాం : Harish Rao
X

దిశ, తూప్రాన్ : కరోనా సమయంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరి రైతుబంధు డబ్బులిచ్చామని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. తూప్రాన్ శివారులో రూ.4కోట్ల 98 లక్షల వ్యయంతో నిర్మించిన వ్యవసాయ గ్రైన్ మార్కెట్ యార్డును సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం‌తో నియోజకవర్గం రూపురేఖలు మారాయన్నారు. రైతులు పండించే పంటకు సరైన మార్కెట్ లేని పరిస్థితులలో నేడు మూడు మార్కెట్‌లు నిర్మించుకున్నామన్నారు. రైతుల శ్రేయస్సుకు ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుస్తోందన్నారు.

ఉచిత కరెంటు, సాగునీరు అందించడంతో పాటు పెట్టుబడి సాయంగా రైతుబంధు, రైతు భీమా ఇస్తున్నామన్నారు. రైతు బంధు ద్వారా రాష్ట్రంలో రూ.65 వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. రైతు చనిపోతే రైతు బీమా ద్వారా రూ.5 లక్షలు ఇచ్చి రైతు కుటుంబాన్ని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇప్పటివరకు 98 వేల మంది రైతుల కుటుంబాలకు రైతు భీమా అందించమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీరు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఎండాకాలంలో కూడా హల్దీ వాగు చెక్ డ్యామ్‌ల‌పై నుండి మత్తడి దూకుతోందన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగుల, ఎమ్మెల్యేల, జీతాలు ఆపి రైతులకు రైతుబంధు వేశామన్నారు. వృద్దులకు ఆసరా పింఛన్లు, పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి అందిస్తున్నానమని మంత్రి తెలిపారు.

గత13 సంవత్సరాల నుండి పెండింగులో ఉన్న జీడిపల్లి, కాళ్ళకల్, కుచారం, ముప్పిరెడ్డి పల్లి గ్రామ భూ నిర్వాసితులకు 374 ఇళ్ల పట్టాలు అందజేశామన్నారు. అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీలో రూ.22 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. మల్కపూర్‌లోలో జీపీ భవనం, మహిళా భవనం సీసీ రోడ్డు, మినీ ఫంక్షన్ హాల్ యూత్ భవనం ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్కపూర్‌లో యువకుల కృషి వలన ప్రజల సహకారం చూసి సాక్షాత్తూ సీఎం కేసీఆర్ దత్తత తీసుకుని అన్ని రకాలుగా అభివృద్ధి చేశారరన్నారు. స్వయం కృషితో ముందుకు సాగాలని ప్రభుత్వ సపోర్ట్ ఉంటుందన్నారు. అనంతరం మల్లన్న సాగర్ నిర్వాసితులకు, కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మె్ల్సీ యాదవ రెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్, ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, హేమలత శేఖర్ గౌడ్, జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్లు ప్రతిమా సింగ్, రమేష్, ఆర్డీఓ శ్యాం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed