ఎన్నో అడ్డంకులు.. అయినా అధిగమించాం.. : మంత్రి నిరంజన్ రెడ్డి

by Disha Web Desk 4 |
ఎన్నో అడ్డంకులు.. అయినా అధిగమించాం.. : మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాలమూరును సస్యశామలం చేసేందుకు రూపొందించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎన్ని ఆటంకాలు సృష్టించిన వాటిని అధిగమించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ పంప్ హౌస్‌లో ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ మోటార్లు ప్రారంభించనున్న సందర్బంగా గురువారం అయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లుగా కృష్ణానదిలో తెలంగాణ వాటా తేల్చలేదన్నారు.

ఎన్నో అడ్డంకులు.. అయినా అధిగమించాం.. : మంత్రి నిరంజన్ రెడ్డిఅలాగే ప్రాజెక్టు ముందుకు సాగకుండా అనేక రకాల అవరోధాలు సృష్టించారన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు దాదాపు రూ.25 వేల కోట్లు దశలవారీగా కేటాయించుకుని ఈ ప్రాజెక్టును పూర్తిచేసుకుంటున్నామన్నారు. ఇది ప్రపంచంలోనే అతి భారీ ఎత్తిపోతల పథకమని అయన పేర్కొన్నారు. ఒక్కొక్కటీ 145 మెగావాట్ల మహా బాహుబలి పంపులను ఈ ప్రాజెక్టులో వినియోగించడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాల పెండింగ్ ప్రాజెక్టులు కూడా తెలంగాణ ప్రభుత్వంలోనే పూర్తిచేసుకున్నామన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల శంకుస్థాపన సందర్భంగా 11 జూన్ 2015 న సీఎం కేసీఆర్ సమావేశంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకం కార్యరూపం దాల్చి ముందుకు సాగుతుందని నిరంజన్ రెడ్డి తెలిపారు. కృష్ణమ్మ నీళ్లను కలశాలలో గ్రామ, గ్రామానికి తీసుకువచ్చి ప్రతి దేవాలయం, ప్రార్ధనాలయాలలో అభిషేకం చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్న విషయాన్ని ఈ సందర్భంగా అయన గుర్తు చేశారు. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలలో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పట్టుదలతో పూర్తిచేసుకున్నామని తెలిపారు. ఈ నెల 16న కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రంగారెడ్డి పంపుల వెట్‌రన్‌తో పాలమూరు ప్రజల కల నెరవేరబోతున్నదని ఆయన తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణంలో భాగస్వామిని కావడం చిరస్మరణీయమైన అంశంగా తానూ భావిస్తున్నానని మంత్రి తెలిపారు.

Next Story

Most Viewed