గురుకులం విద్యార్థుల‌తో వెట్టి చాకిరీ

by Disha Web Desk 12 |
గురుకులం విద్యార్థుల‌తో వెట్టి చాకిరీ
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: వెనుకబడిన కులంలో పుట్టి చదువుకునే స్థోమత లేక ఎందరో విద్యార్థులు కుటుంబ పోషణ కోసం చిన్నా చితకా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులు ఎలాగైనా తమ పిల్లలను విద్యావంతులుగా చేయాలనే తాపత్రయంతో వారిని ప్రభుత్వం నడుపుతున్న బీసీ హాస్టళ్లలో చేర్చి చదివిస్తున్నారు. అయితే హాస్టల్‌లో విద్యార్థులను సొంత బిడ్డల్లా చూడాల్సిన వార్డెన్ వారితో వెట్టి చాకిరీ చేయిస్తూ బాల్యాన్ని హరిస్తున్నారు. అభం, శుభం తెలియని చిన్నారులు ఆటలపాటలతో చదువుకుంటూ కాలం గడిపేవారు. ఎలాంటి భారాలు లేకుండా గడిచిపోయే బాల్యం వారిది.

అటు వంటి చిన్నారులతో హాస్టల్‌ అధికారులు మోయలేని భారాలు మోపిస్తున్నారు. చిన్నపిల్లలు అని చూడకుండా ఐన‌వోలు జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్‌ బాలుర గురుకులం విద్యార్థుల‌ను ఉపాధ్యాయులు ప‌ని మ‌నుషులుగా మార్చేశారు. ఒక రోజు కాదు రెండు నెల‌లుగా ఈ తంతు సాగుతున్నట్లుగా విద్యార్థుల ద్వారా దిశకు తెలిసింది. హాస్టల్‌లో చేయ‌రాని, చేయ‌కూడ‌ని ఎన్నో ప‌నుల‌ను విద్యార్థుల చేత చేయిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు దిశ‌కు చిక్కాయి.

వండేది విద్యార్థులే.. ఊడ్చేది విద్యార్థులే..

ఐన‌వోలు మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలుర గురుకులంలో దారుణ సంఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. వరంగల్ జిల్లా వ‌ర్ధన్నపేట మండ‌లంలోని ఉప్పరపల్లి క్రాస్ వద్ద ఐన‌వోలు మండ‌ల జ్యోతి బాఫూలే బాలుర గురుకులం కొన‌సాగుతోంది. నిర్వహ‌ణ ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునేందుకు వార్డెన్ శ్వేత, వైస్ ప్రిన్సిపాల్ అశోక్ విద్యార్థులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నట్లు ఆరోప‌ణ‌లున్నాయి. తాజాగా ఇందుకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

విద్యార్థులతో కిచెన్ క్లీనింగ్, పూరీ తయారీతో పాటు, వివిధ పనులు చేయిస్తున్న దృశ్యాలు వీడియోల్లో స్పష్టంగా క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. గ‌దులను శుభ్రం చేయ‌డం, గిన్నెలు తోమ‌డం లాంటి ప‌నుల‌న్నీ కూడా విద్యార్థుల‌చేత చేయిస్తుండ‌డం గ‌మ‌నార్హం. కూర‌గాయ‌లు క‌ట్ చేయ‌డం, వంట చేయ‌డం, అత్యంత ప్రమాద‌క‌రంగా వేడి వేడి గంజుల‌ను సైతం విద్యార్థులచేత దించేలా చేయిస్తున్నారు. స్కూల్ పిల్లలతో తమ సొంత కారు, బైక్ లను సైతం శుభ్రం చేయిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

విద్యార్థుల సంఖ్య త‌క్కువేనా..?

గురుకుల పాఠ‌శాల విద్యార్థుల సంఖ్య రికార్డుల ప్రకారం 560 అని తెలుస్తుండ‌గా, గురుకులంలో ఉండేది మాత్రం అందులో సగం కంటే మించ‌ర‌ని స‌మాచారం. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ‌గా చూపుతూ బిల్లులు భోంచేస్తున్నట్లుగా అత్యంత విశ్వస‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది. హాస్టల్‌లో జ‌రుగుతున్న అక్రమాల‌పై స‌ద‌రు శాఖ ఉన్నతాధికారుల‌కు స‌మాచారం ఉన్నప్పటికీ చ‌ర్యలు తీసుకోవ‌డం లేద‌ని ఆ శాఖ ఉద్యోగుల నుంచి తెలుస్తుంది.

అవును ఆ వీడియో మా గురుకులానిదే..

ఆ వీడియోలో ఉన్నది నిజ‌మే. ప‌ని చేస్తున్నది మా హాస్టల్ విద్యార్థులే. స్పెషల్​ మెనూ ఇచ్చేట‌ప్పుడు ఇలాంటి ప‌నులు విద్యార్థుల‌కు చెబుతుంటాం. హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య ఎక్కువ‌గా ఉండడంతో వారంద‌రికీ స‌మ‌యానికి భోజ‌నం, టిఫిన్లు అందించ‌డానికి కొన్ని సంద‌ర్భాల్లో ఇలా చేస్తుంటాం.:–రాజేంద్రాచారి, ప్రిన్సిపాల్‌, ఐన‌వోలు బీసీ వెల్ఫేర్ గురుకులం



Next Story

Most Viewed