సమానహక్కును ఉద్యమంలా కొనసాగించాలి...

by Dishanational1 |
సమానహక్కును ఉద్యమంలా కొనసాగించాలి...
X

దిశ, మహబూబాబాద్ టౌన్: మహిళల భాగస్వామ్యం పెంచేందుకు సమాన హక్కును ఉద్యమంలా కొనసాగిస్తేనే తప్ప తగిన న్యాయం చేకూరదని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత అభిప్రాయపడ్డారు. బుధవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ శశాంక ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు మహబూబాబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ లతో కలిసి ఎంపీ కవిత పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభిస్తూ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత మాట్లాడారు. సమాన హక్కు ప్రకటించిన పొందలేకపోతున్నామన్న భావన మహిళల్లో ఉండిపోయిందని, ఉద్యమంలా కొనసాగిస్తేనే భాగస్వామ్యాన్ని అందుకోగలుగుతామని నొక్కి వక్కాణించారు. తన ప్రస్థానం తన తండ్రి ప్రోద్భలంతోనే కొనసాగిందని తద్వారా భర్త సహకారం కూడా లభించిందని అందువలననే ఈ స్థాయికి చేరుకోకలిగాను అన్నారు.


ప్రతి మహిళకు ఆత్మస్థైర్యం పెంపొందించేది విద్యనేనని, విద్యతోనే ఏదైనా సాధించగలుగుతామన్నారు. అన్ని రంగాలలో పోటీపడగలుగుతామన్నారు. వ్యాపారంలో రాణించగలుగుతామన్నారు. తండాల్లోనే మార్పు వచ్చిందని ప్రభుత్వం కూడా కేసీఆర్ కిట్టు, ఆసరా పెన్షన్లు, స్త్రీ నిధి బ్యాంకు లింకేజీ వంటి పథకాలతో మహిళలను ప్రోత్సహిస్తున్నారని, వాటిని అందిపుచ్చుకునే అవకాశం మాత్రం అంతంత మాత్రంగానే ఉందని, వీటన్నిటినీ సాధించేందుకు విద్య ఒక్కటే మార్గమన్నారు. జిల్లా కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ జిల్లాలో మహిళా భాగస్వామ్యమే ఎక్కువగా ఉందన్నారు. మంత్రిగా, పార్లమెంటు సభ్యురాలుగా, జడ్పీ చైర్ పర్సన్ గా, ప్రజాప్రతినిధులుగా, అధికారులుగా అన్ని రంగాలలో పోటీ పడటం సంతోషకరంగా ఉందన్నారు. ఎంపీపీలు 16 మంది ఉండగా అందులో 12 మంది మహిళలని, జడ్పీటీసీలు 16 మంది ఉండగా 11 మంది మహిళలేనని.. సర్పంచులు 461 మంది ఉండగా అందులో 265 మంది మహిళలేనని, ఎంపీటీసీలు 191 మంది ఉండగా అందులో 116 మహిళలేనని ఉద్యోగులలో కూడా 30% మహిళలే ఉన్నారన్నారు. 1908లో ఓటు హక్కుతోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవంకి పునాది పడిందని సమానత్వం కల్పించినసమానంగా రాణించలేకపోతున్నారన్న భావన ప్రతి ఒక్కరికి ఉందన్నారు. అందుకు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి మహిళల సమానత్వం కోసం కృషి చేసిందని, మహిళలందరూ ఉద్యమిస్తేనే సాధ్యమవుతుందన్నారు. తన తల్లి సహకారంతోనే కలెక్టర్ ను కాగలిగానన్నారు. మహిళలు తాము తక్కువ అన్న భావన విడనాడాలన్నారు. విద్యతో ఆత్మస్థైర్యం ఏర్పడుతుందని స్వతంత్రత పొందుతామని తద్వారా సాధికారత సాధించగలుగుతామన్నారు.


ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ మహిళల స్థితిగతులు మెరుగయ్యాయని, మరింత మెరుగయ్యేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటూ తోటి మహిళలను ఎదిగేలా కోర్కోవాలని అన్నారు. మహిళల సేవలు ఎనలేనివని ఎంత పొగిడినా తక్కువేనన్నారు. సమాజంలో రాణిస్తున్నామంటే మహిళలే కారణమన్నారు. చిన్నంతనం నుండి ధైర్యసహసాలు నూరి పోస్తూ చైతన్యవంతులుగా తీర్చిదిద్దుతూ స్ఫూర్తిదాయక సందేశాలను అందించడం గొప్ప విశేషం అన్నారు.

మహబూబాబాద్ శాసనసభ్యులు బానోతు శంకర్ నాయక్ మాట్లాడుతూ తల్లి, తండ్రి, గురువు, దైవం అని సరోజినీ ఝాన్సీ రుద్రమ్మ ఐలమ్మ వంటి మహిళలే కాక పూర్ణ వంటి మహిళ కూడా ఎవరెస్టును అధిరోహించి మహిళల్లో ఆత్మస్థైర్యం పెంపొందించిందని అన్నారు. మహిళలు క్షణికావేశములో జీవితాలు కోల్పోవడం సమంజసం కాదన్నారు. ఆలోచన ఉండాలని భవిష్యత్తు చాలా ఉందన్నారు. ఆడవాళ్లు కన్నీళ్లు కారిస్తే మగవారు గుండెల్లో బాధ అనుభవిస్తారని.. అందరూ సమానమే నన్న భావన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. పావలా వడ్డీ రుణాలతో మహిళల కుటుంబాలు ఆర్థికపరంగా వ్యాపారాలు చేపట్టి రాణించాలన్నారు. అనంతరం వివిధ రంగాలలో పోటీ పడుతూ రాణిస్తున్న మహిళలను 40 మందిని ఎంపిక చేసి శాలువాలను కప్పి మెమోంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు అభిలాష అభినవ్ డేవిడ్, జడ్పీ సీఈవో రమాదేవి, బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ నాగవాణి, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వప్న, వ్యవసాయ శాఖ అధికారి చత్రు నాయక్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని వరలక్ష్మి, మహబూబాబాద్ తహశీల్దార్ నాగ భవానీ, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed