ఆ 100 సర్వేల్లో నేనే టాపర్.. ‘‘దిశ’’తో సంచలన విషయాలు వెల్లడించిన MLA నన్నపునేని

by Disha Web Desk 19 |
ఆ 100 సర్వేల్లో నేనే టాపర్.. ‘‘దిశ’’తో సంచలన విషయాలు వెల్లడించిన MLA నన్నపునేని
X

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: ‘‘నాపై ఎవరెన్ని కుట్రలు చేసినా.. అక్కసు వెళ్లగక్కినా.. విద్వేషం చూపినా.. నియోజకవర్గం అభివృద్ధిని, నా రాజకీయ ఎదుగుదలను అడ్డుకోలేరు. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ల మార్గదర్శకత్వంలో నడుస్తున్నా. రోజూ 16 గంటలు ప్రజలతోనే గడుపుతున్నా. నా పని తీరుపై నాయకులు తప్ప ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు’’ అని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ స్పష్టం చేశారు. ‘దిశ’ ప్రతినిధితో ఆయన ఫేస్ టు ఫేస్..

ఇంటింటికి బొట్టు కార్యక్రమం ఎలా ఉంది..?

నియోజక వర్గంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు 2 వేల మంది ఉన్నారు. వీళ్లంతా ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి, పార్టీ కండువా అందజేసి, బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం ఆహ్వాన పత్రిక ఇస్తున్నారు. 26వ తేదీ నుంచి ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభిస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి లబ్ధి పొందిన ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తాం.

పార్టీ నాయకులను కలుపుకొని వెళ్లడం లేదన్న విమర్శ ఉంది కదా..?

నేను కింది స్థాయి నుంచి వచ్చాను. అందరినీ కలుపుకొనే వెళ్తున్నాను. కష్టపడి పని చేసే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తానని కేసీఆర్, కేటీఆర్ అన్నారు. 24 డివిజన్లలో 20 సీట్లు గెలుచుకున్నాం. ఇటీవల నిర్వహించిన 100 సర్వేల్లో నియోజక వర్గంలో నేనే టాపర్‌గా నిలిచాను. సీఎం ఏ పని అప్పగించినా బాధ్యతతో చేస్తున్నా. టికెట్‌పై కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడతా. నన్ను విమర్శించే వాళ్లకూ పదవులున్నాయి.

ఎమ్మెల్యేగా మీరు చేసిన పనులేంటి..?

చాలా ఉన్నాయి. రూ.1100 కోట్లతో సూప‌ర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నాం. రూ.80 కోట్లతో బ‌స్ స్టేష‌న్‌, క‌లెక్టరేట్ మంజూర‌య్యాయి. టెండ‌ర్ ప్రాసెస్ న‌డుస్తోంది. రూ.250 కోట్లతో నిర్మిస్తున్న స్టార్మ్ వాట‌ర్ డ్రైనేజ్ సిస్టం పూర్తయితే చాలా కాల‌నీలు ముంపు నుంచి బ‌య‌ట‌ ప‌డ‌తాయి. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేస్తున్నాం. జర్నలిస్టులకు కూడా ఇళ్లు ఇస్తున్నాం. వరంగల్ అభివృద్ధికి చాలా ప్రణాళికలు ఉన్నాయి. ఇక్కడి నిరుపేదలకు గత పాలకులు 40 ఏళ్లలో ఏమీ చేయలేదు. మేం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకుంటామంటే ఊరుకోం.

మీపై భూకబ్జా ఆరోపణలున్నాయి. మావోయిస్టులు లేఖ కూడా విడుదల చేశారు కదా..!

నేను ఒక్క గ‌జం భూమి క‌బ్జా చేసిన‌ట్లు నిరూపించినా వ‌రంగ‌ల్ చౌర‌స్తాలో ముక్కు నేల‌కు రాస్తా. గతంలోనూ కొందరు చేసిన ఆరోపణలను నిరూపించలేదు. మావోయిస్టులు అవగాహన లేకనే లేఖ విడుదల చేశారు. నా కబ్జాలు నిరూపించాలని సవాల్ విసురుతున్నా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా వ్యాపారాలూ వదులుకున్నా. సొంత డబ్బుతోనే ఎందరికో సాయం చేస్తున్నా. అసూయ, కుట్రలతో చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు.

బీజేపీ, కాంగ్రెస్ నుంచి పోటీ ఎలా ఉంటుంది..?

వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేసినా నేను 50 వేల మెజారిటీతో గెలుస్తా. తూర్పు వరంగల్ లో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది. నా నియోజక వర్గంలో సెక్యులరిజం అంటే ఏంటో చూపిస్తా. నా పని పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఓర్వలేని కొందరు నాయకులు ఆధారం లేని ఆరోపణలతో బట్ట కాల్చి మీదేస్తున్నారు.


Next Story

Most Viewed