ఆ కార్యాలయంలో అధికారి ఎవరు..?

by Ratna Kumari |   (  Updated:2026-02-27 10:40:57  IST  )

కేసముద్రం మండలంలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో అతను ఆడిందే ఆట పాడిందే పాట. కార్యాలయానికి అధికారి ఎవరనేది అర్థం కాని పరిస్థితి ప్రజలకు ఏర్పడింది.

ఆ కార్యాలయంలో అధికారి ఎవరు..?
X

దిశ, కేసముద్రం : కేసముద్రం మండలంలోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో అతను ఆడిందే ఆట పాడిందే పాట. కార్యాలయానికి అధికారి ఎవరనేది అర్థం కాని పరిస్థితి ప్రజలకు ఏర్పడింది. కార్యాలయ అధిపతి ఉన్నప్పటికీ అంతా తానే చూస్తున్నటువంటి వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగినా.. లేక ప్రైవేటు ఉద్యోగా..? లేక‌ కార్యాలయ అధిపతి నియమించుకున్న పర్సనల్ వ్యక్తి నా అని ప్ర‌జ‌ల‌కు అనేక సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్రజలే కాదు కార్యాలయంలో పని చేసే సిబ్బందికి కూడా అర్థం కాని పరిస్థితి నెల‌కొంది. ఆ కార్యాల‌యంలో అతను చెప్పిందే వేదం. ఎలాంటి పనైనా సరే అధికారికి చెప్పకుండా అతనికి చెప్పేస్తే పని అయిపోతుందని సిబ్బంది చెబుతున్నారు.


అతనికి ఫోన్ పే కొడితే ఎంతటి కష్టతరమైన పని అయినా సరే సులభతరం అవుతుంది. ప్రజలు అధికారిని కలిస్తే పనవుతుందో లేదో కానీ అతన్ని కలిస్తే మాత్రం తప్పక పని అవుతుంది అని కేసముద్రం మండలంలో గుసగుసలాడుతున్నారు. ఈ పరిస్థితి ఎలా ఉందంటే "ఫోన్ పే కొట్టు గిఫ్ట్ పట్టు" అనే ఒక టీవీ షో లాగా ఉంది. సిబ్బంది వ్యవహారాలైన ప్రజల వ్యవహారాలైన అతనికి చెప్పుకుంటే సరిపోతుంది. కొంతమంది కిందిస్థాయి సిబ్బంది అతని కను సైగల్లోనే పని చేస్తూ ఉంటారు. అధికారి గారి దగ్గరికి పోవడం కంటే అతని దగ్గరికి వెళ్తే సరిపోతుంది. అతనికి చెబితే సరిపోతుంది. . అన్ని తానే చూస్తున్న అధికారికి అన్నీ తెలిసిన ఏమీ తెలియనట్టు వ్యవహరించడం ఇక్కడ కొసమెరుపు. అతనికి అక్కడున్న కొంతమంది సిబ్బంది సహకరించడం వల్లనే ఇదంతా జరుగుతుందనేటువంటి సమాచారం ఉంది. అతని ఫోన్ పే చెక్ చేస్తే ఎవరెవరు ఎంత కొట్టారో ఎందుకు కొట్టారు పూర్తి వివరాలు బయటకు వస్తాయి. ఇంత జరుగుతున్నప్పటికీ అధికారికి ఏమి తెలియదు అని చెప్పడం హాస్యాస్పదం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్న‌తాధికారులు ఆ కార్యాలయంలో కార్యాలయ అధిపతికి అతనికున్న సంబంధం బయటకు తీసి ప్రజలకు న్యాయం చేస్తారని కేసముద్రం మండల ప్రజలు కోరుకుంటున్నారు.

Next Story