బీజేపీలోకి రాణా ప్రతాప్.. చేరికకు ముహూర్తం ఫిక్స్

by Web Desk |
బీజేపీలోకి రాణా ప్రతాప్.. చేరికకు ముహూర్తం ఫిక్స్
X

దిశ, నర్సంపేట: వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్‌ టీఆర్ఎస్ బహిష్కృత నేత, జనతా ట్రస్ట్ వ్యవస్థాపకులు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 16వ తేదీన బీజేపీ పెద్దల సమక్షంలో అధికారికంగా కాషాయ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మీడియా ప్రతినిధులకు చెప్పినట్లు తెలుస్తోంది. రాణా ప్రతాప్ రెడ్డి సోదరి అయినా యువ తెలంగాణ పార్టీ లీడర్ రాణి రుద్రమ బీజేపీలో చేరనున్న సందర్భంగా, ఆమెతో పాటు రాణా ప్రతాప్ కూడా చేరుతున్నట్లు ప్రకటించారు. కాగా, గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ పార్టీకి నర్సంపేట డివిజన్‌లో రాణా ప్రతాప్ రెడ్డి సేవలు అందించారు. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా చురుగ్గా పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలోనే నర్సంపేట నియోజకవర్గంలో బలమైన యువనేతగా ఎదిగారు. ఈ క్రమంలో జనతా ట్రస్ట్ అనే ఓ సంస్థను ఏర్పాటు చేసి, పలు సేవా కార్యక్రమాలు చేశారు. పేదరికం కారణంగా, అకాల వర్షం, వడగండ్ల కారణంగా ఇబ్బందులు పడ్డ నిరుపేదలకు రాణా తన సొంత డబ్బులతో నిత్యావసర సరుకుల రూపంలో, ఆర్థికంగా కూడా ఆసరా అయ్యాడు. నర్సంపేట నియోజకవర్గంలో యువనేతగా సుపరిచితం అయిన రాణా ప్రతాప్ రెడ్డి, అతని తండ్రి ప్రతాప్ రెడ్డిపై ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అప్పటి నుండి రాణా ఏ పార్టీలో చేరుతాడో అన్న ఉత్కంఠ నర్సంపేట డివిజన్ ప్రజల్లో మెదులుతోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్‌లో బలమైన యువనేతగా ఉన్న రాణా బీజేపీలోకి వెళ్తుండటంతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని డివిజన్‌లో చర్చ జరుగుతోంది.

Next Story

Most Viewed