జనగామలో పులి సంచారం కేవలం వదంతులే : సీఐ సత్యనారాయణ రెడ్డి

by Ratna Kumari |

జనగామ పట్టణ పరిధిలోని ప్రిస్టన్ గ్రౌండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో (వాట్సాప్, ఫేస్‌బుక్) వైరల్ అవుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

జనగామలో పులి సంచారం కేవలం వదంతులే :  సీఐ సత్యనారాయణ రెడ్డి
X

దిశ, జనగామ : జనగామ పట్టణ పరిధిలోని ప్రిస్టన్ గ్రౌండ్‌తో పాటు పలు ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందంటూ సోషల్ మీడియాలో (వాట్సాప్, ఫేస్‌బుక్) వైరల్ అవుతున్న ప్రచారాలు పూర్తిగా అవాస్తవమని జనగామ సీఐ సత్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ తరహా వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన తెలిపారు. పులికి సంబంధించినవిగా పాత వీడియోలు, ఫోటోలను మళ్లీ ప్రచారం చేసి ప్రజల్లో భయాందోళన సృష్టించడం చట్టరీత్యా నేరమని సీఐ హెచ్చరించారు. ఇటువంటి తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసే వారిపై, ఫార్వర్డ్ చేసే వ్యక్తులపై కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కానీ అనవసరంగా భయపడవద్దని సీఐ సూచించారు. ఏవైనా వన్యప్రాణుల కదలికలపై అనుమానం కలిగితే స్వయంగా ప్రచారాలు చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

నిజానిజాలు తెలుసుకోండి

అటవీ శాఖ లేదా పోలీస్ శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా సందేహం ఉన్నట్లయితే వెంటనే స్థానిక జనగామ పోలీసులను లేదా డయల్ 100ను సంప్రదించాలని సూచించారు. శాంతి, భద్రతలకు విఘాతం కలిగించేలా అసత్య వార్తలు వ్యాప్తి చేసే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని సీఐ సత్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు.

Next Story