హాట్‌హాట్‌గా మంథని పాలిటిక్స్.. ముందే మొదలైన ప్రచారం

by Disha Web Desk 4 |
హాట్‌హాట్‌గా మంథని పాలిటిక్స్.. ముందే మొదలైన ప్రచారం
X

దిశ, కాటారం: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మంథని నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంది. ఇటీవల నియోజకవర్గంలో పర్యటించిన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ లు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎన్నికల గురించి మాట్లాడారు. ప్రజల పక్షాన నిలిచే నేతలనే ఎన్నుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో పరోక్షంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. మంథని నియోజకవర్గం కేంద్ర బిందువుగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబుపై ఎప్పటికప్పుడు నియోజకవర్గ పర్యటనలో ఆరోపణల దాడిని తీవ్రం చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పుట్ట మధు సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా మారారు. ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు పలు మండలాల్లో ఎప్పటికప్పుడు తీవ్రంగా ఖండిస్తూ అవగాహన లేని నాయకునిగా కొట్టిపారేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభివృద్ధిని చూసి పుట్టమధుకర్ ను గెలిపించాలని పార్టీ శ్రేణులు కోరుతుండగా, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న పుట్టమధుకర్ ను ప్రజలు ఎన్నికల్లో ఓడించినప్పటికీ సిగ్గు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేసినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మంథని నియోజకవర్గంలో బీజేపీ టికెట్ ఆశిస్తున్న చందుపట్ల సునీల్ రెడ్డి నియోజకవర్గంలో గ్రామగ్రామాన పర్యటిస్తూ ఇద్దరి పాలనను చూసినందున ఒకసారి తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నియోజకవర్గంలో శుభకార్యాలు, ఇతరత్రా కార్యక్రమాలకు చందుపట్ల సునీల్ రెడ్డి హాజరవుతూ అందర్నీ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ప్రతి నిత్యం నియోజకవర్గంలోని ఏదో ఒక గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కార్యక్రమాలలో టీఆర్ఎస్ కాంగ్రెస్ ల మధ్య ప్రొటో కాల్ రగడ జరుగుతూనే ఉంది. ఏది ఏమైనా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం గతంలోకంటే భిన్నంగా ముందుగానే ప్రారంభమైంది.



Next Story

Most Viewed