పట్టాలు పొందేవరకు పోరాడుదాం: తమ్మినేని

by Dishanational1 |
పట్టాలు పొందేవరకు పోరాడుదాం: తమ్మినేని
X

దిశ, హన్మకొండ: గుడిసె వాసుల పట్టాలు పొందేవరకు పోరాడి హక్కులు సాధించుకుందామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హన్మకొండలోని హైగ్రీవచారి గ్రౌండ్ లో జనచైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.రానున్న ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించాలని సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్ర చేపట్టామని తెలిపారు. దేశంలో మనుధర్మ శాస్త్రాన్ని బలంగా తీసుకు వెళ్లే జనాలను విడదీసేందుకు బీజేపీ పార్టీ రామభజన చేస్తుందన్నారు.

దేశవ్యాప్తంగా పేద, ధనిక కులాలే ఉన్నాయని చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తుందని, వ్యతిరేకిస్తే కేసులు పెట్టి వేధిస్తుందని అన్నారు. దేశ సంపదను అదానీ, అంబానీకి, కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతుందని ఆరోపించారు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని కొన్ని వందల మంది నిరుపేదలు ఎటువంటి సౌకర్యాలు లేకున్నా కుటుంబ సభ్యులతో జీవనం కొనసాగిస్తున్నారని, వారికి వెంటనే ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ఇవ్వకపోతే విడిచి పెట్టే సమస్యే లేదని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, నియోజకవర్గల ప్రజాప్రతినిధులతో సీపీఎం పార్టీ నాయకత్వంలో వినతి పత్రం అందిచామని చెప్పారు.


Next Story