కేయూ ఎడ్యుకేషన్ కళాశాలలో మరో అక్రమార్కుడికి షోకాస్ నోటీస్

by velandi.Saikiran |

వీసీ ఆదేశాల మేరకు పార్ట్ టైం లెక్చరర్ డా.పోరిక రమేష్ కు షోకాజ్ నోటీసు జారీ జేసిన రిజిస్ట్రార్‌

కేయూ ఎడ్యుకేషన్ కళాశాలలో మరో అక్రమార్కుడికి షోకాస్ నోటీస్
X

దిశ హన్మకొండ టౌన్ : కాకతీయ విశ్వవిద్యాలయం ఎడ్యుకేషన్‌ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్‌గా పనిచేస్తున్న పోరిక రమేష్‌ విధి నిర్వహణల పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో విశ్వవిద్యాలయం నియమించిన విచారణ కమిటీ విచారణ చేసింది. ఈ తరుణంలోనే పోరిక రమేష్‌ పలు అవకతవకలకు పాల్పడినట్టు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే, మోడరేషన్ ప్రాసెస్ ఫీజుల వసూళ్లలో అక్రమాలు జరిపి, ఆ నిధులను అనుచితంగా వినియోగించారని ఆరోపణలు పోరిక రమేష్‌ పై ఉన్నాయి. అంతేకాకుండా అనుబంధ ప్రైవేట్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, అధ్యాపకులతో దురుసుగా ప్రవర్తించారని, వాగ్దాడి చేశారని కమిటీ తెలిపింది. ముఖ్యంగా విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను అక్రమంగా కేటాయించడం, ప్రైవేట్‌ కళాశాలల నుండి అనధికారికంగా డబ్బులు వసూలు చేయడం వంటి అంశాలలో రమేష్‌ పాత్ర ఉందని కమిటీ తేల్చింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణించిన వైస్‌ చాన్స్‌లర్‌ వెంటనే వివరణ కోరారు.వీసీ ఆదేశాల మేరకు పార్ట్ టైం లెక్చరర్ డా.పోరిక రమేష్ కు షోకాజ్ నోటీసు జారీ చేసారు. ఇక పోరిక రమేష్‌ మూడు పని రోజుల లోపు లిఖితపూర్వక సమాధానం సమర్పించాల్సి ఉంటుందని, ఆయన సమాధానం ఇవ్వని పక్షంలో లేదా సమాధానం తగినదిగా లేకపోతే కఠిన చర్యలు తప్పవని రిజిస్ట్రార్‌ స్పష్టం చేశారు.

మొదటి నుంచి మొత్తుకుంటున్న కేయూ విద్యార్థి సంఘాలు

ప్రిన్సిపాల్ రణధీర్ రెడ్డి, పోరిక రమేష్ లు అనేక అక్రమాలకు పాల్పడుతున్నట్లు మార్చి 13 తేదీన బీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ ఆరెగంటి నాగరాజు నేతృత్వంలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొ . వల్లూరి రామచంద్రం కు ఫిర్యాదు చేశారు. మాజీ ప్రిన్సిపాల్ రణధీర్ రెడ్డి గత మూడు సంవత్సరాల కాలంలో రికార్డులు సరిగా లేవని చెప్పి బెదిరింపులకు గురిచేసి 46 ప్రైవేట్ బీఈడీ కళాశాలల నుంచి లక్షల రూపాయలను రమేష్ ద్వారా అక్రమ దందాలకు పాల్పడినట్లు విద్యార్థి సంఘాల ఆరోపించాయి. విశ్వవిద్యాలయ ప్రతిష్ట దెబ్బతినేలా జరిగే ఇటువంటి సంఘటనలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, అధ్యాపక వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Next Story