''అమ్ముకుందామన్న ఇక మా దగ్గర ఏమీ లేవు''.. సర్పంచుల ఆవేదన

by Disha Web Desk 19 |
అమ్ముకుందామన్న ఇక మా దగ్గర ఏమీ లేవు.. సర్పంచుల ఆవేదన
X

దిశ, నల్లబెల్లి: గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయడానికి అమ్ముకుందామన్న ఇప్పుడు మా దగ్గర ఏమీ లేవని సర్పంచులు మండల సర్వసభ్య సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఉడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు గోడు వెల్లబోసుకున్నారు. పనులు పూర్తై ఏండ్లు గడుస్తున్న బిల్లులు రాకపోవడంతో సర్పంచులు అప్పుల ఊబిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చెప్పిన విధంగా పనులు పూర్తి చేసిన బిల్లులు రావడం లేదని వాపోయారు. మండల సభ జరిగిన ప్రతిసారి తమ ఆవేదన చెప్పుకున్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండటం లేదని.. ఇప్పటికైనా సభ ఏకగ్రీవ తీర్మానం చేయాలని కోరారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో విజయ్ కుమార్ మాట్లాడుతూ.. సర్పంచుల సమస్యలను పేపర్ మీద రాసివ్వాలని కోరాడు. దీంతో సర్పంచులు భగ్గుమన్నారు. సర్వసభ్య సమావేశంలో అడుగుతుంటే మళ్లీ రాసి ఇవ్వమనడం ఏంటని ప్రశ్నించారు. సభ ఏకగ్రీవ తీర్మానం చేయాల్సిందేనని, లేకపోతే సర్పంచులు అందరం సమావేశం నుండి బైకాట్ చేస్తామని హెచ్చరించారు. బిల్లులు తక్షణం చెల్లించాలని సభ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నట్లు ఎంపీపీ సునీత ప్రవీణ్ గౌడ్ తెలిపారు.

అనంతరం విద్యా, వైద్యం, ఇరిగేషన్, మిషన్ భగీరథ అంశాల మీద చర్చ జరిగింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు క్వింటాకు ఐదు నుండి 8 కిలోల వరకు అక్రమంగా కటింగ్ చేస్తున్నారని.. అధికారులు వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో పోడు భూములకు హక్కు పత్రాలు కలిగి ఉన్న వ్యవసాయ భూములకు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని సర్పంచ్ తిరుపతి అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, తహసీల్దార్ మంజుల, ఎంపీడీవో విజయ్ కుమార్, విద్యుత్ ఏఈ, ఎంఈఓ సత్యనారాయణ, ఏవో పరమేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed