పేటలో విచ్చలవిడిగా మట్టి దందా..!

by Disha Web Desk 20 |
పేటలో విచ్చలవిడిగా మట్టి దందా..!
X

దిశ, నర్సంపేట టౌన్ : నర్సంపేట పట్టణ వ్యాప్తంగా మట్టిదందా వ్యాపారం రోజురోజుకూ పెరిగిపోతోంది. అధికారుల అలసత్వమో లేక మట్టిదందా చేసే వ్యక్తుల ధైర్యమో వెరసి పట్టణ వ్యాప్తంగా మట్టిదందా నిరాటంకంగా కొనసాగుతున్నది. ఓవైపు అసైన్డ్ భూముల్లో అక్రమ వెంచర్లు వెలుస్తుండగా ఇదే క్రమంలో మరోవైపు మట్టి దోపిడి ఇష్టారాజ్యంగా కొనసాగుతుంది. ప్రధానంగా నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డు, మల్లంపల్లి రోడ్డు, పాకాల రోడ్డులో కొందరు నాయకులు అసైన్డ్ భూముల్లో హద్దులు వేసి ప్లాట్లుగా యథేచ్ఛగా అమ్ముతున్నారు. పట్టణంలో భూములకు విపరీతంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో సామాన్యుడి ఇంటి కలను తమకు వ్యాపార వస్తువుగా నిస్సిగ్గుగా మలుచుకుంటున్నారు.

పాటించాల్సిన నిబంధనలను తుంగలో తొక్కి అధికారుల అండతో వీరి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిరాటంకంగా మూడుపువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. ఇక పట్టాభూముల్లో కాలువ కట్టల వెంబడి రోడ్డు సౌకర్యం లేకున్నప్పటికీ అన్ని రకాల అనుమతులు ఇస్తూ అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారా..? అనే అనుమానం ప్రజల్లో ఇప్పటికే బలంగా ఉంది. అయితే అసైన్డ్ భూముల్లో సైతం ఇదే ఇదే ఒరవడిలో అధికారుల తీరు ఉండడంతో రియల్టర్లకు దాహానికి అడ్డే లేకుండా పోయింది. దీనికి తోడు పట్టణంలో ఇబ్బడిగా పుట్టుకొస్తున్న వెంచర్లలో మట్టికి డిమాండ్ ఏర్పడింది. స్థానికంగా ఉన్న కొందరు చోటామోటా నాయకులు మట్టి దందాలోకి దిగి ప్రభుత్వ భూముల్లో, చెరువుల్లో, కుంటల్లో మట్టిని తవ్వుతూ వ్యాపారం చేస్తున్నారు.

దీనితో ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీ రాకపోగా రహదారుల వెంట తీవ్ర కాలుష్యం ఏర్పడుతున్నది. చెరువుల్లో కుంటల్లో ఏర్పడిన గుంతలతో ప్రమాదం సైతం నెలకొంది. పట్టణంలోని ఒకటో వార్డులో పట్టపగలే టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నారు. కాలనీ గుండా వాహనాలు వేగంతో వెళ్తుండటంతో ప్రజలు ప్రాణాలని అర చేతుల్లో పెట్టుకోవాల్సిన దుర్భర పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ట్రాక్టర్ల ద్వారా పట్టణం ప్రధాన రహదారి గుండా అక్రమ మట్టిని తరలిస్తున్నప్పటికీ ఏ ఒక్క అధికారి గానీ పట్టించుకోకపోవడం పై పలుఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో మాదన్నపేట రోడ్డులో అసైన్డ్ భూముల్లో ఫ్లాట్లను వేయగా అధికారుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ నేటికీ ఎలాంటి చర్యలకు పూనుకోలేదు. తాజాగా ఒకటో వార్డు పరిధిలో 30 గుంటల్లో మట్టిని పోసి చదును చేసి ప్లాట్లుగా అమ్మేస్తున్నారు.

భరించలేనంతగా మట్టి భారం..!

నర్సంపేట పట్టణానికి సమీపంలోని చెరువులు, కుంటల్లో నుండి పరిమితికి మించి మట్టిని తోడేస్తుండటంతో మృత్యుకేంద్రాలుగా మారుతున్నాయి. ఇక్కడ నుండి పట్టణంలోని పలుకాలనీలకు తరలిస్తున్న మట్టికి అధిక ధర వసూలు చేస్తున్నారు. ఒక్కో టిప్పర్ (పది చక్రాలు)లో తరలించే మట్టికి రూ. 5500 చార్జీ చేస్తున్నారు. చిన్నటిప్పర్ కి రూ.2500లను వినియోగదారుల నుండి వసూలు చేస్తున్నారు. ట్రిప్ ట్రాక్టర్ కి రూ. 800-1000 లను పట్టణ వ్యాప్తంగా వసూలు చేస్తున్నారు. వినియోగదారుల నుండి వ్యతిరేకత వస్తున్నా తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ వెంచర్లకు ఈ మట్టే..

నర్సంపేట పట్టణ శివారుల్లో గత కొన్ని నెలలుగా అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ భూముల్ని లెవల్ చేయడానికి అవసరమైన మట్టికోసం వీరిని ఆశ్రయిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా యథేచ్ఛగా చెరువుల్లో, కుంటల్లో తోడేస్తున్న మట్టిని ఈ వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రాత్రిళ్ళు వాహనాల హోరుతో పట్టణ ప్రజలు భయం భయంగా నిద్రిస్తున్నారు. చోటా మోటా నాయకుల కనుసన్నల్లో ఈ దందా జరుగుతుండటంతో కాలనీవాసులు ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నారు.

అధికార పార్టీ నేత ఆగడాలు..

అసైన్డ్ భూమి సర్వేనెంబర్ 111లో 30 గుంటల భూమిలో అధికార పార్టీ నేత వెంచర్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. మాదన్నపేట చెరువు ప్రాకారంలో నర్సంపేట శివారులో కాలువ గట్టు పక్కన వెంచర్ ఏర్పాటుచేసి ఆ స్థలానికి అక్రమంగా మట్టిని పెద్ద మొత్తంలో తరలించారు. అధికార పార్టీ నేత కావడంతో ఏ అధికారి నోరు మెదపని పరిస్థితి దాపురించింది.

ఇకనైనా స్పందిస్తారా..?

నర్సంపేట పట్టణంలో రాత్రి పగలు జరుగుతున్న మట్టిదందా పై పట్టణ ప్రజలు తీవ్ర అసంతృప్తి నెలకొంది. పట్టించుకోవాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తుండటంతో అసహనానికి గురవుతున్నారు. పట్టణ వీధుల్లో టిప్పర్లు యథేచ్ఛగా తిరుగుతున్నా పట్టింపు ఉండదా అని ప్రశ్నిస్తున్నారు. రాత్రిళ్ళు వేగంగా నడిచే వాహనాలతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకుని ఈ మట్టి దందాపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Next Story