మత్స్యకారులకు అదిరిపోయే శుభ‌వార్త‌

by velandi.Saikiran |

చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి

మత్స్యకారులకు అదిరిపోయే శుభ‌వార్త‌
X

దిశ, వరంగల్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఘనపూర్ రిజర్వాయర్ ద్వారా ఏటా సుమారు నాలుగు వందల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందన్నారు. నాలుగు కోట్ల రూపాయల విలువైన చేపలు మార్కెట్లోకి వస్తున్నాయని తెలిపారు. మత్స్యకారుల ఆదాయం పెరగడం కోసం చేపలను పెంచడంతో పాటు మార్కెటింగ్ సదుపాయాలు, రవాణా సౌకర్యాలు కల్పించేలా అధికారులను సూచించినట్టు తెలిపారు.

ప్రస్తుతం రిజర్వాయర్ పరిధిలో 319 మహిళా సంఘాల సభ్యులు, 700 మంది మత్స్యకార సంఘ సభ్యులు, మరో 300 మంది సభ్యత్వం కోసం అప్లై చేసుకున్నారని మొత్తం 1300 మంది మత్స్యకారులు నెలకు పదివేల రూపాయలకు పైగా సంపాదించే స్థాయికి చేరుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆగస్టు నెలలో చేప పిల్లలను వదిలే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి, చేపల ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకుంటాం అని అన్నారు. నియోజకవర్గంలోని ముదిరాజుల ఆర్థిక అభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అలాగే ఘనపూర్ పట్టణ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు తెలిపారు. అందులో నాలుగు కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా, ఆర్డీ ఓ వెంకన్న, జిల్లా మత్స్య శాఖ అధికారి రానా ప్రతాప్, డీపీవో, తహసీల్దార్ జిల్లా మత్స్య సహకార సంఘ అధ్యక్షులు, సొసైటీ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story