కానిస్టేబుళ్ల రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: CP Tarun Joshi

by Dishanational1 |
కానిస్టేబుళ్ల రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు: CP Tarun Joshi
X

దిశ, వరంగల్ టౌన్: తెలంగాణ పోలీస్ శాఖలో భర్తీ చేయనున్న కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు నిర్వహించనున్న ఆర్హత రాత పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ నెల 28వ తేదీ ఆదివారం నిర్వహించబడే కానిస్టేబుళ్ళ రాత పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లపై సన్నాహక సమావేశాన్ని గురువారం కాజీపేటలోని నిట్ కళాశాలలోని సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేయడంతోపాటు ఇన్విజిలేటర్లకు బయోమెట్రిక్ శిక్షణ అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో మొత్తం కానిస్టేబుళ్ళ అర్హత రాత పరీక్షకు 52,970 మంది అభ్యర్థులు హాజరవుతుండగా ఇందులో వరంగల్ జిల్లా పరిధిలో 13476 మంది హనుమకొండ జిల్లా పరిధిలో 32934 మంది, జనగామ జిల్లా పరిధిలో 6560 మంది అభ్యర్థులు కానిస్టేబుళ్ల రాత పరీక్ష రాస్తున్నారన్నారు.

ఇందుకోసం మొత్తం 106 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో వరంగల్ జిల్లా పరిధిలో 34, హనుమకొండ జిల్లా 87, జనగామ జిల్లా 17 కేంద్రాలు ఉన్నాయని... రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలి ముద్రలు తీసుకునే విధంగా సిబ్బందికి శిక్షణ అందజేసినట్లు.. అదేవిధంగా రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు సమయానికి ఒక గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాల్సి ఉంటుందని, పరీక్షకు సంబంధించి నియమ నిబంధనలు హాల్ టికెట్ లో పొందుపరిచి ఉంటాయని, పరీక్ష గదిలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువులను అనుమతించబోమన్నారు.

అభ్యర్థులు చేతులకు గోరింటాకు, మెహేంది వంటివి పెట్టుకోవడం వలన బయోమెట్రిక్ లో వేలి ముద్ర సరిగా వచ్చే అవకాశం ఉండదని, తద్వారా అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా పరీక్షకు సంబంధించిన నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయబడుతుందని, పరీక్ష పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తామని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే ఎవరినీ నమ్మరాదని, అలాంటి వ్యక్తులు ఏవరైనా తారసపడితే పోలీసులకు సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.

ఈ సమావేశంలో అదనపు డీసీపీ వైభవ్ గైఖ్వాడ్, వరంగల్, హనుమకొండ జిల్లాల రిజనల్ కో ఆర్డినేటర్లు డా. చంద్రమౌళి, ప్రో. అనంద్ కిషోర్ కోలా, ఏసీపీలు ప్రతాప్ కుమార్, రహమాన్, ఇన్ స్పెక్టర్లు నరేష్ కుమార్, సంతోష్ తోపాటు ఐటీకోర్ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story