సోమవారం నుంచి శనివారం వరకు... ఇల్లు & కార్యాలయం అన్నీ ఇక్కడే..!

by Dishanational1 |
సోమవారం నుంచి శనివారం వరకు... ఇల్లు & కార్యాలయం అన్నీ ఇక్కడే..!
X

దిశ, మరిపెడ(చిన్నగూడూర్): చిన్న గూడూరు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం రోజుకొక అంశం కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా మారుతుంది. మరీ ముఖ్యంగా ఎంపీడీఓ వ్యవహార శైలి పలు విమర్శలకు దారితీస్తుంది.

మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న ఎంపీడీవో ఇక్కడే మకాం వేసి పగలు, రాత్రి తేడా లేకుండా ఇక్కడే గడుపుతుండడంతో తోటి ఉద్యోగులకు ఇబ్బందికరంగా మారినట్టు ఆరోపణలు వెళ్లి వెత్తుతున్నాయి. ఇదేం పద్ధతి అని ఎవరైనా అడిగినట్లయితే నేను ఎక్కడికి వెళ్లినా ఈవిధంగానే ఉంటాను అంటూ బదులు ఇవ్వడం, కార్యాలయంలోనే ఉంటూ పగలు, రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్నానని, తనని కలెక్టర్ కూడా మెచ్చుకున్నారంటూ చెప్పడంతో పలువురు విస్మయానికి లోనవుతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు కార్యాలయాన్ని ఇల్లుగా మార్చుకుని శనివారం సాయంత్రం తన సొంత స్వగ్రామానికి చేరుకుని మరుసటి రోజు తిరుగు ప్రయాణమవుతున్నట్టు సమాచారం.

రెంట్ అలవెన్స్ 11% మింగుతున్న వైనం.!

ఏ ప్రభుత్వాధికారైనా ప్రభుత్వ కార్యాలయంలో బస చేయడం, కార్యాలయాన్ని ఇల్లుగా మార్చుకోవడం నిబంధనలకు విరుద్ధం. ప్రభుత్వం ప్రతి ఒక్క అధికారికి వాళ్ల హోదా తగ్గట్టు శాలరీ రూపంలో అద్దె బకాయి చెల్లిస్తుంది. ఇదే కాకుండా మెయింటెనెన్స్ ఖర్చుల కోసం, పెట్రోల్ ఖర్చుల కోసం కూడా తగిన మోతాదులో అలవెన్స్ సౌకర్యం కల్పిస్తుంది. కానీ దీనికి విరుద్ధంగా అలవెన్స్ ఖర్చులు మిగిల్చుకోవడం, ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతటితో ఆగకుండా సదరు అధికారి మండల కేంద్రాన్ని విజిట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ అని ఎవరైనా వచ్చి అడగాగానే నర్సరీల చుట్టూ తిరిగి వచ్చి కార్యాలయంలో కాలయాపన చేస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్యలో క్రీడా ప్రాంగణాలు అంటూ తిరుగుతున్నాడే తప్ప ఏదైనా సమస్య జరిగితే మండలలో, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్లనే వెళ్లడని ప్రజలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు.

కరెంట్ బిల్ మొండి బకాయి @ 55,789..!

స్థానిక ఎంపీడీవో డిప్యూటేషన్ పై వచ్చి సుమారు 10 నెలలు దాటుతుండడంతో ఇక్కడ అన్ని కార్యకలాపాలు చేస్తుండటం ఎండాకాలంలో ఏసీని సైతం ఉపయోగించుకోవడం, రోజూ రైస్ కుక్కర్లో అన్నం వండుకోవడం, చలికాలంలో నీళ్లు వేడి చేసే కరెంట్ హీటర్ ని సైతం వాడుకుంటున్నట్లు ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా కరెంటు వాడుకోవడంతో బిల్లు తడిసి మోపెడు కావడం విశేషం. ఇప్పటికీ ఆ బిల్లు చెల్లించకపోవడం, కరెంటు వాళ్లు కూడా కిమ్ అనకుంటా ఉండడంతో కరెంట్ బిల్లు మొండి బకాయి ఈ నెలతో 55 వేల రూపాయల మార్కు దాటడం విశేషం. సామాన్యుని మీద ప్రతాపం చూపించే కరెంట్ అధికారులు ఈ మొండి బకాయినీ ఎందుకు వసూలు చేయడం లేదని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

ఇంకా నిద్ర లేవని నిఘా నేత్రాలు.!

ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేసి ఉండాలి. కానీ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఇప్పటివరకు సీసీ కెమెరాలు లేకపోవడంతో రాత్రి వేళలో ఏదో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు, కొంతమంది వ్యక్తులు రాత్రిపూట కార్యాలయంలో పార్టీలు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 16/10/2022న ఎంపీడీవో కార్యాలయం పక్కనే ఉన్న అంగన్వాడీ సెంటర్లో చోరీ జరగడంతో ఇటువంటి సంఘటనలు బలాన్ని చేకూరుస్తున్నాయి. కార్యాలయంలో అనేక ఫైల్స్, కంప్యూటర్లు ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాల నుంచి సీసీ కెమెరాలు లేకపోవడంలో ఆంతర్యం ఏంటని, మండల పరిషత్ లో రెండు లేదా మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే బడ్జెట్ లేదా అని లేక రాత్రి వేళలో ఏమైనా తప్పు ఒప్పులు జరుగుతున్నాయా అని ప్రజలు వారి సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు.

ఓ ఉన్నతాధికారి ప్రాణ స్నేహితుడట?

డీఆర్డీఓలో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి, ఎంపీడీఓ స్నేహితులంటూ మండల వాసులు గుసగుసలాడుతున్నారు. అందుకే ఇక్కడ ఏం జరిగినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఉదాహరణగా ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగినా దానిపైన ఎటువంటి ఎంక్వయిరీ వేయకపోగా సదరు పంచాయతీ కార్యదర్శిని బదిలీ చేసి చేతులు దులుపుకున్నారు. ఎంక్వయిరీ కోసం వచ్చిన ఓ ఉన్నతాధికారి కార్యాలయంలోనే కాలయాపన చేసి మళ్లీ బాధితులతో బహిరంగంగా విచారణ చేస్తానని మాట ఇచ్చి, ఇప్పటివరకు అధికారి కనిపించకపోవడం ఈ విమర్శనలకు బలాన్ని చేకూరుస్తుంది.

ఏది ఏమైనా ఉన్నతాధికారుల ఉదాసినత వల్ల చిన్న స్థాయి ఉద్యోగి నుంచి, పెద్ద స్థాయి ఉద్యోగి వరకు తాము ఎలాంటి అవినీతి చేసిన ఏమి కాదు అనే ధీమాను ఉద్యోగులకు ఇస్తున్నారా అనే సందేహం మొదలవుతుంది. ఇదే జరిగితే అవినీతి విశ్వరూపం చూపించడం ఖాయం.

Read more:

అసెంబ్లీలో తప్పుడు ప్రచారం చేయాలని KCR చూస్తున్నాడు


Next Story

Most Viewed