ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ఇంటింటా సంక్షోభం తెచ్చింది

by velandi.Saikiran |

వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్.

ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. ఇంటింటా సంక్షోభం తెచ్చింది
X

దిశ, వరంగల్ బ్యూరో: ఇందిరమ్మ రాజ్యం తెలంగాణలోకి వచ్చి ఇంటింటా సంక్షోభం నింపిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకున్న పంటల కొనుగోలు తాలూకు నిర్ణయం రాష్ట్ర రైతాంగానికి ఉరితాడుగా మారబోతుందని కేటీఆర్ అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ పార్టీ కార్యకర్తల సమావేశంలో సోమవారం భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా ఒకటే ఆవేదన ఆక్రందన కనిపిస్తోందన్నారు. పదేండ్ల తెలంగాణ రెండున్నర ఏండ్లలో సంక్షోభంలోకి జారుకున్నదన్నారు. కాంగ్రెస్ ని నమ్మి ఓటేస్తే అన్ని వర్గాలను అడ్డగోలుగా మోసం చేస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఏం లబ్ధి జరిగింది, ఎన్ని కొత్త పథకాలు వచ్చాయని ప్రశ్నించారు.

ఒకవైపు ఎరువుల కొరత, విత్తనాల కొరత, కరెంటు కోతలు, కొత్తగా రైతు డిస్కం పేరుతో ఉచిత విద్యుత్తు కుట్రలు, రైతుబంధు ఎగవేత, రైతుబీమా రద్దు ఇలా దుర్మార్గంగా స‌ర్కార్ వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. ఆనాడు రైతుబంధు మేమెందుకు ఎగగొడతామ‌ని, ఇప్పుడు ఎగ‌గొట్టే కుట్రలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. వచ్చే ఐదేళ్లు చిట్టి నాయుడుకి, ఆయన బృందానికి సినిమా చూపెట్టే బాధ్యత నాదంటూ వ్యాఖ్యానించారు. మా కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ఒక్కొక్కడిని రిటైర్ అయినా, పారిపోయినా, సప్త సముద్రాలు దాటినా లాక్కొచ్చి నిలబెడతాన‌ని హెచ్చ‌రించారు. తెలంగాణలో ఇవాళ ఎవరిని కదిలించినా ఒకటే మాట..మళ్లీ కేసీఆరే రావాలి అంటున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు కేటీఆర్. కాగా ఈ సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమానికి సంబంధించిన అంశాల పైన కూడా పార్టీ కార్యకర్తలకు కేటీఆర్‌ ఒక ప్రజంటేషన్ ద్వారా వివరాలు అందజేశారు.

Next Story