కన్నీరు మిగిలించిన రాళ్ళ వాన..

by Disha Web Desk 20 |
కన్నీరు మిగిలించిన రాళ్ళ వాన..
X

దిశ, కన్నాయిగూడెం : కన్నాయిగూడెం మండలంలో గురువారం నుండి ఈదురు గాలులతో, వడగాళులతో పాటు రాళ్లవాన బీభత్సం సృష్టించింది. మండలంలో వడగళ్లవాన రూపంలో అరగంట సేపు వరణుడు తన ప్రతాపాన్ని చూపించాడు. ఎవ్వరూ ఊహించనట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా కారు మబ్బులు కమ్మి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వడగళ్ల వర్షం కురవడంతో అందరూ బెంబేలు ఎత్తిపోయారు. ఒక్కరోజులోనే మండల వ్యాప్తంగా కోట్లలో నష్టం వాటిల్లినట్టు అంచనా. పూరిగుడిసెలు కుప్పలుగా కూలిపోయినాయి, రేకులఇండ్లు, రాళ్ళవానకు ధ్వంసమైనాయి. భారీగా కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు తీరని శోకాన్ని మిగిల్చాయి.

మండలంలో వేలాది ఎకరాల్లో సాగు చేసే వరి, మొక్కజొన్న, మిర్చి తోటలు వడగళ్ల వర్షానికి పూర్తిగా దెబ్బ తిన్నాయి. మండలంలో రాళ్లవానకు పంటలు నామరూపాలు లేకుండా నేలమట్టమయ్యాయి. గ్రామాలలో రాళ్ల వాన తాకిడికి తట్టుకోలేక పాడిగేదేలు మృతి చెందినాయి. ఆరుగాలం లక్షల్లో పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికొచ్చే సమయానికి వర్షం కారణంగా పంట దెబ్బ తినడంతో రైతులు కంటతడి పెట్టుకుంటున్నారు. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పేనాథుడే లేకపోవడంతో రైతుసోదరులు వినిపిస్తున్నారు. మండలంలో అకాల వర్షాలకు జరిగిన పంటనష్టాన్ని అంచనా వేసి రైతులకు ప్రభుత్వం అండగా నివ్వాలని రైతు సంఘ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed