కొండా సురేఖ ఫిర్యాదుపై స్పందించిన కడియం

by velandi.Saikiran |   (  Updated:2026-07-08 10:40:27  IST  )

కొండా సురేఖ ఫిర్యాదుపై స్పందించిన కడియం శ్రీహ‌రి, ఆమెది అవగాహన లోపం అంటూ కౌంట‌ర్ ఇచ్చారు.

కొండా సురేఖ ఫిర్యాదుపై స్పందించిన కడియం
X

దిశ, వరంగల్ బ్యూరో: కొండా సురేఖ ఫిర్యాదుపై స్పందించిన కడియం శ్రీహ‌రి, ఆమెది అవగాహన లోపం అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. కేవలం త‌న‌ నియోజకవర్గ ఆలయాల గురించి మాట్లాడేందుకు వెళ్ళానని పేర్కొన్నారు. అయినా ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడకూడదు అని చెప్పే మంత్రిని మొదటిసారి చూస్తున్నానని ఫైర్ అయ్యారు కడియం శ్రీహరి. రూల్స్ త‌న‌కు తెలుసని..ఎక్కడా రూల్స్ అతిక్రమించలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదుపై బుధవారం స్టేషన్ ఘనపూర్ లో మాట్లాడారు.

ఈ సంద‌ర్భంగా క‌డియం మాట్లాడుతూ, బిజినెస్ రూల్స్, రాజ్యాంగ ప్రకారం..కేబినెట్ ర్యాంక్ లో ఉన్నవారు మాత్రమే సమీక్ష చేస్తారన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమీక్షలో పాల్గొంటారన్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర కార్యాలయానికి వెళ్లి దేవాదాయ శాఖ కమిషనర్ ను కలిసానని తెలిపారు. ఆలయాల అభివృద్ధి కోసం ఆలయ కమిటీ చైర్మన్లతో కలిసి పలు వినతి పత్రాలు అందజేశానన్నారు.

తాను తప్పు చేయనప్పుడు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేద‌ని కౌంటర్ ఇచ్చారు. అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. త‌న‌ అధికారాలు, పరిమితులు ఏంటో త‌న‌కు తెలుసు అన్నారు. త‌న‌పై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధగా ఉందని తెలిపారు. అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగించాలి.... కాంట్రావర్సీల కోసం కాదని పరోక్షంగా చుర‌క‌లు అంటించారు.

Next Story