ప్రభుత్వం తరపున భరోసా ఇస్తే పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా : దాత కోరే వెంకన్న

by Dishaweb |
ప్రభుత్వం తరపున భరోసా ఇస్తే పాఠశాల అభివృద్ధికి సహకరిస్తా : దాత కోరే వెంకన్న
X

దిశ, గూడూరు: ప్రభుత్వం తరఫున భరోసా ఇస్తే పాఠశాల అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని పొనుగోడు పాఠశాల దాత కోరే వెంకన్న తెలిపారు. గూడూరు మండలం పొనుగోడు పాఠశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గతంలో నేను పాఠశాలను దత్తత తీసుకున్నప్పుడు పాఠశాలలో 17 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 550 విద్యార్థుల వరకు పెరిగిందని అన్నారు. తను పుట్టిన ఊరు పై మమకారంతో పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ప్రాథమిక పాఠశాల నుండి నేడు ఉన్నత పాఠశాలగా అప్ గ్రేడ్ చేయించానని అన్నారు. ఈ పాఠశాలలో ప్రైవేటు ఉపాధ్యాయులు నియమించి వారికి నెలనెలా జీతాలు ఇస్తూ సాంకేతిక విధానములో డిజిటల్ తరగతులతో విద్యా బోధన అందిస్తున్నామని తెలిపారు.

వెంకన్న ఢిల్లీ లో ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ ఉంటారు. ఢిల్లీ లాంటి విద్య మారుమూల ప్రాంతాలకు కూడా అందాలనే సదుద్దేశంతో పాఠశాలను దత్తత తీసుకున్నట్లు చెప్పారు. పదిహేను రోజుల కింద పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలియజేయడం చాలా బాధగా ఉన్నదని అన్నారు. అలాంటి సమస్య ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకువస్తే బాగుండేది అని అన్నారు. నేను ఈ విషయంపై అధికారులకు తెలిపిన వారు సకాలంలో స్పందించలేదని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పాఠశాల లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో 2019 నుండి డెవలప్మెంట్ ఫీజు తీసుకున్నామని అన్నారు.ఆ నిధులు పాఠశాల అభివృద్ధి కోసమే వెచ్చించినట్లు తెలిపారు.ఈ సంవత్సరం నుండి రెండు ఇంటర్నెట్ టవర్ ఏర్పాటు చేసి ఢిల్లీ నుంచి ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిద్దాం అనుకున్నామని తెలిపారు.వారితో పాటు గ్రామ ఎంపీటీసీ రజిత సోము నాయక్, పడమటి తండా,రాములు తండా సర్పంచ్ లు,గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story