అక్రమాలకు అడ్డాగా కంచనపల్లి పీఏసీఎస్.. డీసీఎస్ అధికారుల తీరుపై అనుమానాలు

by Disha Web Desk 11 |
అక్రమాలకు అడ్డాగా కంచనపల్లి పీఏసీఎస్.. డీసీఎస్ అధికారుల తీరుపై అనుమానాలు
X

దిశ, జనగామ: రైతులకు రుణాలు అందించి వెన్నుదన్నుగా నిలువాల్సిన సహకార బ్యాంకు అవినీతి, అక్రమాలకు అడ్డాగా మారింది. జనగామ జిల్లా కంచనపల్లి వ్యవసాయ సహకార సంఘంలో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నా అధికార యంత్రాంగం మాత్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ సహకార సంఘంలో దాదాపు రూ.30 నుండి రూ. 40 లక్షల వరకు అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే పలువురు డైరెక్టర్లు జిల్లా కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య, డీసీఎస్ బ్యాంకు ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినా అధికార యంత్రాంగంలో ఏ మాత్రం స్పందన లేదు.

ఫిర్యాదు చేసి నెల రోజులు కావస్తున్నా అక్రమాలపై నిగ్గు తేల్చడంలో జిల్లా ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ నాన్చివేత ధోరణిని అనుసరిస్తుండడం పలు విమర్శలకు దారితీస్తోంది. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ చైర్మన్ చీమలపాటి రవి ఆరోపిస్తుండగా, సహకార సంఘంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ డైరెక్టర్లు విచారణ చేయాలని పట్టుబట్టగా, ఇప్పటికీ ఇందులో ఇసుమంత కూడా పురోగతి లేదు. విచారణ పంపుతున్నట్లుగా చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్ల వాంగ్మూలం సేకరించి వదిలేస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడని అన్న చందంగా సహకార సంఘంలో జరిగిన నగదు దుర్వినియోగంపై బ్యాంక్ అధికారుల పాత్ర ఉందని కూడా డైరెక్టర్లు అనుమానిస్తున్నారు. అధికారుల సహకారం లేకుండా చెక్కులు ఎలా విడిపించారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.

సీఈవో పాత్రపై అనుమానాలు..?

కంచనపల్లి ప్రాథమిక సహకార సంఘంలో జరిగిన అక్రమాల వెనుక బ్యాంకు సీఈవో వంగ శ్రీనివాస్ హస్తం ఉన్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. సీఈవో తన సంతకాన్ని ఫోర్జరీ చేశాడని చైర్మన్ రవీందర్ ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో, డీసీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై డీసీఎస్ అధికారులు ఇంతవరకు దృష్టిసారించక పోవడం విచారకరం. శాఖ పరంగా విచారణ చేస్తున్నామని చెబుతున్నా డీసీఎస్ ఉన్నతాధికారులు, ఈ అక్రమాల సూత్రధారికి సహకరిస్తున్నట్లు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లేకపోతే దీనిపై విచారణ చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. సీఈవో అక్రమాలకు పాల్పడకపోతే మరి చెక్కులు విడిపించిందెవరు..? అనే కోణంలో కూడా అధికారుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. సీఈవో ప్రమేయం లేకుండా, జిల్లా అధికారుల ప్రమేయం లేకుండా, బ్యాంకులో నుంచి నగదు ఎలా విడిపించారు..? ఎవరు విడిపించారు..? అధికారులు ఎందుకు విచారణ చేయడం లేదు. అధికార యంత్రాంగం ఈ అవినీతిపై దృష్టి సారించి దోషులను గుర్తించాలని, లేకపోతే ఇటు సీఈవో, అటు డీసీఎస్ అధికారుల తీరుపై మరిన్ని అనుమానాలు బలపడే అవకాశం ఉంది.

ఈ మూడేళ్లలో కోటికి పైగా ఆదాయం..?

ఈ మూడేళ్లలో వడ్లు, మక్కల కొనుగోలు కేంద్రాల నిర్వాహణ కారణంగా కంచనపల్లి సహకార సంఘానికి కమిషన్ రూపంలో రూ.1.10 కోట్లు రాబడి వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో నుంచి రూ. 53 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు ఫిబ్రవరి చివరిలో జరిగిన సమావేశంలో సీఈవో లెక్కలు చూపాడు. కానీ ఇందుకు సంబంధించిన రసీదులు, దస్త్రాలు మాత్రం చూపలేకపోయాడు. దీంతో ఖర్చు చేసిన రూ.53 లక్షల సొమ్ముపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అంతేకాదు సహకార సంఘానికి జిల్లా సివిల్ సప్లై విభాగం నుంచి మంజూరైన రూ. 80 లక్షల సొమ్ముకు కూడా లెక్కలు సరిగా లేకపోయినా, విచారించాల్సిన డీసీఎస్ అధికారులు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని, స్వయంగా డైరెక్టర్లే వాపోతున్నారు. దీంతో డీసీఎస్ అధికారులు, జిల్లా బ్యాంక్ అధికారుల పాత్రపై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్ల ఆరోపణలపై ఈ జిల్లాకు చెందిన సహకార శాఖకు సంబంధించిన అధికారులతో కాకుండా ఇతర జిల్లాకు చెందిన అధికారులతో విచారణ చేపడితే నగదు లావాదేవీల అక్రమాల గుట్టురట్టు అయ్యే అవకాశం ఉందని పలువురు అంటున్నారు.

ఖాతా ఎందుకు క్లోజ్ చేశారు..?

కంచనపల్లి ప్రాథమిక సహకార సంఘానికి రెండు పర్సనల్ ఖాతాలు ఉన్నాయి. ఒకటేమో కంచనపల్లి గ్రామానికి చెందిన సెంట్రల్ బ్యాంక్ లో, మరొకటేమో జిల్లా సహకార బ్యాంకులో ఉంది. అయితే ఇటీవల కాలం వరకు సహకార సంఘం సీఈవో సెంట్రల్ బ్యాంక్ ఖాతాను నిర్వహించి ఈ మధ్యకాలంలో క్లోజ్ చేశారు. దీని పైన కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

2022 వార్షిక సంవత్సరం వరకు ఈ ఖాతా చలామణిలో ఉండి, యాక్టివ్ గా పనిచేసింది. అలాంటి ఖాతాను ఎందుకు క్లోజ్ చేశారు..? అనే దానిపై కూడా ఇప్పటివరకు అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. ఇంతకీ ఈ బ్యాంకులో నుంచి సొమ్మును విడిపించింది ఎవరు..? విడిపించిన సొమ్ము దేనికోసం ఖర్చు చేశారు..? నగదును విడిపించిన తర్వాత ఖాతాలను ఎందుకు క్లోజ్ చేశారు..? సాక్షాలు లేకుండా చేయాలని ఉద్దేశంతోనే దీన్ని క్లోజ్ చేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు.

ఫిర్యాదు అందిన వెంటనే ఎందుకు స్పందించలేదు..?

సహకార సంఘంలో అవినీతి జరిగిందంటూ డైరెక్టర్లు ఫిర్యాదు చేసిన వెంటనే డీసీఎస్ అధికారులు స్పందించకుండా ఫిర్యాదుదారులను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఫిర్యాదు తీసుకున్నప్పటికీ ఎలాంటి అకనాలెడ్జ్మెంట్ ఇవ్వకపోవడం, అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో చైర్మన్ ఫిర్యాదు చేసినా, కేసు నమోదు కాకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సహకార సంఘం పరిధిలో కొత్తగా మంజూరైన పెట్రోల్ పంపు నిర్మాణం కోసం రూ.8లక్షలు, సిమెంట్ బ్రిక్స్ రెడీమేడ్ వాల్ నిర్మాణం కోసం రూ.6 లక్షలు, సహకార సంఘం ఆధ్వర్యంలోని వ్యవసాయ భూమి పట్టా దారు పాసుపుస్తకాల కోసం రూ.2.5 లక్షలు ఖర్చు చేసినట్లు చూపుతున్న వాటిలో కూడా అక్రమాలు జరిగాయని విమర్శలు ఉన్నాయి.

అక్రమాలకు అడ్డాగా సహకార బ్యాంకు....

కంచనపల్లి సహకార సంఘంలో గత కొన్నేళ్లుగా వరుసగా అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. అయినా డీసీఎస్ ఉన్నతాధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. గతంలో పనిచేసిన ఒక చైర్మన్ కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి, ఆ తర్వాత కొన్నాళ్లకు వాడుకున్న సొమ్మును చెల్లించాడు. అదే మాదిరిగా ఇప్పుడు కూడా అవసరమైతే తిరిగి చెల్లిస్తాం అన్నట్లుగా అక్రమార్కులు ఉన్నట్లు సమాచారం. ఇంత ధీమాగా అక్రమార్కులు ఉన్నారంటే వారికి డీసీఎస్ అధికారులు సహకరిస్తున్నారని కూడా అనుమానిస్తున్నారు.

అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన అధికార యంత్రాంగం చూసి చూడనట్లుగా వ్యవహరించడం వల్లే ఇలా మళ్లీ మళ్లీ అవినీతి చోటు చేసుకుంటుందని పలువురు అంటున్నారు. బ్యాంకులో జరిగిన అవినీతిపై రైతులు ఫిర్యాదు చేస్తే తప్ప అధికార యంత్రాంగం దృష్టి సారించకపోవడం విచారకరం. గతంలో జరిగిన అవినీతి, అక్రమాలలోనూ రైతుల ఫిర్యాదుతోనే బట్టబయలు కావడం తెలిసింది. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు తక్షణమే ఈ విషయంపై దృష్టి సారించి, అక్రమాలకు కారకులైన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇకనైనా ఈ విషయంలో ఉన్నత స్థాయి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి.

కలెక్టర్ దృష్టి సారించాలి..

కంచనపల్లి పీఏసీఎస్ లో జరిగిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య దృష్టి సారించి దోషులపై చర్యలు తీసుకోవాలని సహకార సంఘం రైతులు కోరుతున్నారు. విచారణ పేరుతో డీసీఎస్ అధికారులు కాలయాపన చేస్తున్నారని, వెంటనే విచారణ అధికారులను నియమించి అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చాలని కోరుతున్నారు. లేకపోతే రికార్డులు తారుమారయ్యే అవకాశం ఉందని వారు అంటున్నారు.

Next Story