నిలువ నీడ లేదు.. ఇందిరమ్మ ఇల్లు రాలేదు

by velandi.Saikiran |

నిరుపేదలకు గూడు కల్పించాలని లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది

నిలువ నీడ లేదు.. ఇందిరమ్మ ఇల్లు రాలేదు
X

దిశ, డోర్నకల్: నిరుపేదలకు గూడు కల్పించాలని లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే, ఈ ప‌థ‌కం ద్వారా కొంత మంది ల‌బ్దిదారుల‌కు ఇండ్లు అంద‌డం లేద‌ని అంటున్నారు. వివ‌రాల్లోకి వెళితే, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం మలైకుంట తండా శివారు దాన్య తండాకు చెందిన‌ దారావతు బుల్లి, వీరన్నకు నిలువ నీడ లేదు. ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. తాటాకు గుడిసెలో ఇద్దరు కూతుర్లు, కుమారుడుతో జీవిస్తున్నారు. ఈ సందర్భంగా బుల్లి మాట్లాడారు.. గత 25 ఏళ్లుగా పూరి గుడిసెలో కాలం వెళ్లదీస్తున్నట్లు తెలిపారు.

గోడలు కట్టుకొనే స్తోమత లేకపోవడంతో తాటాకులు,చీరలు చుట్టినట్లు తెలిపారు. పగలు కోతులు ఇంట్లోకి చొరబడి నిత్యవసర సరుకులు ఎత్తుకెళ్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాత్రులు విషపురుగులు సంచరిస్తున్నాయని వాపోయారు. అన్ని అర్హతలు ఉన్న తమ‌కు ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని నాయకులను, అధికారులను పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్నట్లు నాయకులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ రామచంద్రనాయక్ చొరవ చూపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

Next Story