డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి

by Ratna Kumari |

సమాజానికి మహమ్మారిగా మారుతున్న మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో మరింత విస్తృతంగా చైతన్యం తీసుకురావాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్ అన్నారు.

డ్రగ్స్ నిర్మూలనపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి
X

దిశ, హనుమకొండ కలెక్టరేట్ : సమాజానికి మహమ్మారిగా మారుతున్న మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో మరింత విస్తృతంగా చైతన్యం తీసుకురావాలని హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హనుమకొండ కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో కలెక్టర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నిర్మూలనపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు. అవగాహన కార్యక్రమాల ద్వారా మత్తు పదార్థాల వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు ఎలా దెబ్బతింటాయో వివరించాలని సూచించారు.

సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పాఠశాల స్థాయిలో “ప్రహరి క్లబ్బులు” ఏర్పాటు చేసి విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్ రాథోడ్, పరకాల ఆర్డీవో వెంకన్న, జిల్లా శిశు సంక్షేమ అధికారి విశ్వజ, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, హనుమకొండ, కాజీపేట, పరకాల ఏసీపీలు నరసింహారావు, ప్రశాంత్ రెడ్డి, సతీష్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదనపు డీఎంహెచ్‌ఓ మదన్మోహన్ పాల్గొన్నారు.

Next Story