జూబ్లీహిల్స్​ బైపోల్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముదిరిన మాటల యుద్ధం

by Muthe.Rajitha |

జూబ్లీహిల్స్​నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముస్లిం ఓట్లు కీలకంగా మారాయి.

జూబ్లీహిల్స్​ బైపోల్.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముదిరిన మాటల యుద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్​నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ముస్లిం ఓట్లు కీలకంగా మారాయి. ఫలితాలు తారు మారు చేసే విధంగా పెద్ద సంఖ్యలో వీరున్నారు. దీనితో అటు అధికార కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి సారించింది. గత ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్​యాదవ్ గణనీయమైన ఓట్లు సంపాదించుకొని రెండో స్థానంలో నిలిచి గట్టి పోటీ ఇచ్చారు. ముస్లిం ఓట్లపైన గురి పెట్టిన హస్తం పార్టీ షెడ్యూల్ రాకముందు నుంచే ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ముగ్గురు ఇంచార్జీ మంత్రులను నియమించి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు చేపట్టింది.

ముస్లీం ప్రాంతాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. నియోజకవర్గంలోని ముస్లిం ఓట్లర్లలో ప్రభావం చూపే ఎంఐఎం పార్టీ పోటీ చేయకపోవడం, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం తమకు కలిసి వస్తుందన్న అంచనాల్లో కాంగ్రెస్​పార్టీ నేతలున్నారు. దీనితో పాటు సీఎం రేవంత్​రెడ్డి ప్రచారంలో ఎఐఎం నేతలు ప్రత్యక్షంగా ఆయనతో కలసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ సీఎం ఎన్నికల ప్రచారంలో ఆయనతో పాటు ప్రచార వాహానంలో పర్యటిస్తున్నారు.

కాంగ్రెస్​పార్టీకి తాము మద్దతు ఇస్తున్నందున నవీన్​యాదవ్​ని గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. కీలకమైన మజ్లీస్​మద్దతు పొందిన కాంగ్రెస్​పార్టీ సీపీఐ, సీపీఎం, తెలంగాణ జన సమితి మద్దతును కూడగట్టుకొని నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. ప్రచారం ప్రారంభంలో బీఆర్ఎస్ పై ప్రధానంగా ఆరోపణలు, విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టిన కాంగ్రెస్ ముఖ్య నేతలు రెండు రోజుల నుంచి డివిజన్లలో కార్నర్ మీటింగులు, రోడ్​షోలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్​రెడ్డి బీజేపీ లక్ష్యంగా ప్రసంగాలు చేస్తున్నారు.

బీజేపీ, బీఆర్ఎస్​లు ఒకటే అని, అది నిజం కాదని నిరూపించేందుకు కాళేశ్వరంపై సీబీఐ విచారణలో ఈనెల 11 లోపు కేసీఆర్, హారీష్​రావులపై ఎఫ్ఐఆర్​నమోదు చేయాలని సీఎం సవాల్ చేశారు. దీనితో పాటు కారు డిల్లీకి పోగానే కమలంగా మారుతోందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. బీజేపీ, కేంద్రమంత్రి కిషన్​రెడ్డిలపై సీఎం రేవంత్​రెడ్డి తన విమర్శల దూకుడును పెంచారు. బీజేపీ వైఖరిని రేవంత్​రెడ్డి తన ప్రసంగాల్లో ఎండగడతున్నారు. ఇటు అజారుద్దీన్​కి మంత్రి పదవు ఇవ్వడం కూడా పాజిటీవ్​అంశమని హస్తం నేతలు చెప్తున్నారు.

ఇటు మైనార్టీల ఓట్ల ప్రాధాన్యతను సంతరించుకోవడంతో క్రైస్తవ సంఘాలతో కాంగ్రెస్​నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా సీఎంతో క్రైస్తవ సంఘ నేతలు సమావేశమై తమ మద్దతును ప్రకటించారు. పార్టీకి చెందిన ముస్లిం ముఖ్య నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్​కుమార్​గౌడ్​ఇటీవల సమావేశం నిర్వహించారు. ప్రచారాన్ని సమన్వయం చేసుకోని వెళ్లాలని సూచించారు. దీనితో వారంతా ఇప్పుడు ప్రచారంలో నిమగ్నమైయ్యారు. ముస్లిం ఓటర్లు తమ వైపే ఉన్నారని హస్తం పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story