రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. బరిలో 83,853 మంది అభ్యర్థులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-14 01:46:06  IST  )

తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.

రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం.. బరిలో 83,853 మంది అభ్యర్థులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. 193 మండలాల్లోని 3,911 సర్పంచ్.. 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనుంది. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసర్పంచి ఎన్నికలు నిర్వహిస్తారు.12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి కనిపిస్తుంది.

కాగా, ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచి, 8307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో ఐదు గ్రామాల్లో, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో రెండు గ్రామాల్లో, 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. ఇవి పోను మిగిలిన పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 4593 మంది రిటర్నింగ్‌ అధికారులు, 30,661 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొనున్నారు. 2489 మందిని ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా నియమించారు. 40,626 బ్యాలెట్‌ పత్రాలను ఎన్నికలకు వినియోగిస్తున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3769 కేంద్రాల్లో పోలింగు ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ చేయనున్నారు.

Next Story