Medical Colleges: వైద్య కళాశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు.. కీలక విషయాలపై ఆరా

by Ramesh Naini |

తెలంగాణలోని మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

Medical Colleges: వైద్య కళాశాలల్లో విజిలెన్స్‌ తనిఖీలు.. కీలక విషయాలపై ఆరా
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని (Medical colleges) మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కమిషన్ (National Medical Commission) హెచ్చరించిన విషయం తెలిసిందే. కాలేజీకి అనుమతులు, సీట్ల పెంపు, రెన్యువల్, రోగుల రికార్డుల విషయంలో నిబంధనలు అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్టవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లో సోమవారం నుంచి విజిలెన్స్‌ అధికారులు (Vigilance officers) తనిఖీలు చేపట్టారు. కళాశాలల్లో సీట్ల వివరాలు, ఫీజులు, స్టయిపెండ్‌, సిబ్బంది సాలరీలు, సౌకర్యాలపై విజిలెన్స్‌ ఆరా తీస్తున్నారు. మెడికల్ కాలేజీ అనుబంధ ఆస్పత్రుల్లో జరిగిన శస్త్రచికిత్సలు, సౌకర్యాలు కాన్పుల డేటా వివరాలను విజిలెన్స్‌ అధికారులు సేకరించే పనిలో ఉన్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రైవేట్‌ మెడికల్ కాలేజీల్లో తనిఖీల నిర్వహణ జరుగుతోంది. కాగా, నేషనల్ మెడికల్ కమిషన్ కొన్ని నిబంధనలను అమలు చేయనున్నట్లు సమాచారం.

ప్రతి మెడికల్ కాలేజ్ తప్పనిసరిగా రోగుల రికార్డులను మెయింటైన్, ఆధార్ కార్డు ఆధారంగా వారి గుర్తింపులు నమోదు చేయడం, ఇన్ పేషెంట్ల వివరాలను డ్యూటీలోని వైద్యాధికారి తప్పని సరి సంతకం చేయాలి. ఎవరైనా తప్పుడు రికార్డు సమర్పిస్తే సంతకం చేసిన డ్యూటీ డాక్టర్ లేదా ఫ్యాకల్టీ లేదా కాలేజీ పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా మెడికల్ సీట్లలో స్థానికులకే ప్రాధాన్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. స్థానికులకే అవకాశం దక్కేలా జీవో 33 ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. జీవో 33 ప్రకారమే కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని, హైకోర్టులో దాఖలు అయిన కేసును కొట్టేయాలని సుప్రీం కోర్టును రాష్ట్ర ప్రభుత్వం కోరనుంది.

Next Story