- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
TG: ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం వాళ్లదే హవా.. మంత్రి ఉత్తమ్ ఫన్నీ కామెంట్స్

దిశ, తెలంగాణ బ్యూరో: సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7,80,000 ఎకరాలకు సాగు నీరు ఇవ్వడమే లక్ష్యమని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఇర్రమంజిల్లోని జలసౌధలో శనివారం సీతారామ సాగర్ బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు అధికారులతో ప్రాజెక్టుపై చర్చించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి నది జలాలు తీసుకొచ్చే ప్రాజెక్ట్ సీతమ్మసాగర్, సీతమ్మ లిఫ్ట్ ఇరిగేషన్ మీద రివ్యూ చేసినట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమని చెప్పారు. ఇందుకు సీతారామ ప్రాజెక్టు, సితమ్మ సాగర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని.. ప్రాజెక్టుకు కనీసం నీటి కేటాయింపులు కూడా జరగలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తమ కృషితో 67 టీఎంసీలు నీటి కేటాయింపు జరిగిందన్నారు.
అలాగే.. సీతమ్మసాగర్ బ్యారేజీకి పర్యావరణ క్లియరెన్స్ లేక ఆగిపోయిందని.. దానికి క్లియరెన్స్ కోసం ప్రణాళిక రెడీ చేశామని చెప్పారు. గతంలో సరైన ప్రణాళిక చేయకపోవడం వల్లే సీడబ్ల్యూసీ నుంచి ఫైన్ కూడా వేశారని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనులు అనుమతులు లేకుండానే ప్రారంభించినందుకు జాతీయ హరిత ట్రిబ్యూనల్ విధించిన 53.41 కోట్ల జరిమానాను రద్దు పరిచేందుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటరీ సిస్టం పైనా చర్చించినట్లు చెప్పారు. అలాగే.. భూ సేకరణ సమస్య, ఫారెస్ట్ ల్యాండ్స్ అనుమతులపైనా చర్చించినట్లు తెలిపారు. ప్రాజెక్టు పురోగతి పై ఆయన స్పందిస్తూ ఇప్పటికే మూడు పంప్ హౌజ్ల నిర్మాణం పూర్తికావడంతోపాటు నాలుగో పంప్ హౌజ్ నిర్మాణ దశలో ఉందన్నారు. మొత్తం మీద ఇప్పటికీ 97 శాతం పనులు పూర్తయినట్లు వెల్లడించారు. పాలేరు లింక్ కెనాల్, సత్తుపల్లి ట్రంక్ కెనాల్, ఎన్కురు లింక్ కెనాల్లు పురోగతిలో ఉన్నయని, భూసేకరణను పూర్తి చేయడంతోపాటు టన్నెల్ నిర్మణాలకు సంబంధించిన పర్యావరణ అనుమతులు త్వరితగతిన పొందేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే అదే సమయంలో పనులలో జరుగుతున్న జాప్యం పై ఆయన అధికారులను సూటిగా ప్రశ్నిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించాలని ఆయన అధికారులకు సూచించారు.
తదుపరి సమీక్షా సమావేశం నాటికి భూసేకరణ పురోగతితో పాటు చెల్లింపులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. సీతమ్మ సాగర్ మల్టిపర్పస్ ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అనుమతులు వేగవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇదే ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మిస్తున్న 282.8 మేఘా వాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన ప్రతిపాదనలు జెన్కో కు పంపించినట్లు ఆయన తెలిపారు. దుమ్ముగూడెం-పాలేరు మెయిన్ కెనాల్ పూర్తికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి పని చేస్తుందని,అందుకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించుకుని పనులలో వేగవంతం పెంచేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ప్రతిపాదించిన ప్రతిపాదనలను పరిశీలనలోకి తీసుకుంటామన్నారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం వాళ్లదే హవా..
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని మంత్రి ఉత్తమ్ సెటైర్ వేశారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు, సీతమ్మ ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. వారి ఒత్తిడితో వీటిని తొరగా పూర్తిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే అధికారులతో రివ్యూ నిర్వహించినట్లు చెప్పారు. కాగా.. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య సైతం హాజరయ్యారు.
సూపర్ పాసేజ్ పిల్లర్ల పరిశీలనకు కమిటీ
ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టు కాలువ సూపర్ పాసేజ్ పిల్లర్ల పరిశీలనకు మంత్రుల సమక్షంలో కమిటీని వేశారు. ఈ కమిటీలో సీఈసీడీఓ (డిజైన్), ఈఎన్సీ (ఓఅండ్ఎం), కొత్తగూడెం సీఈ, సీఈ క్వాలిటీ కంట్రోల్లను నియమించారు. వీరు మిగితా సూపర్ పాసేజ్ పిల్లర్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. మరోసారి ఎక్కడా డ్యామేజీలు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఈ కమిటీని నియమించినట్లు తెలిసింది. అలాగే.. ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని అధికారులతో జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెలిసింది. పాలేరు వరకు ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించినట్లు సమాచారం. కాగా.. ఈ బాధ్యతను అధికారి వినయ్కృష్ణకు అప్పగించారు. అలాగే.. ప్యాకేజీ 6 టన్నెల్లో భాగంగా ఇంకా నాలుగు కిలోమీటర్లు పనులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. అలాగే.. సీతారామ రివైజ్డ్ ఎస్టిమేషన్ 19,000 కోట్ల కోసం ప్రభుత్వానికి అప్పగించగా.. ఆ విషయం చర్చించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదన ఇంకా ఫైనల్ కాలేదని అధికారుల ద్వారా తెలిసింది. అందుకే ఇంతవరకు దానిపై ఎలాంటి ఆర్డర్స్ కూడా రాకపోవడంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. బ్యారేజ్ మీద పవర్ హౌజ్ నిర్మాణంపైనా సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, నీటిపారుదల శాఖ సలహాదారు అదిత్యా దాస్ నాథ్, ఈఎన్సీ అనిల్కుమార్, సీఈ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.