Dharani Problem : ధరణి సమస్య పై తలక్రిందులుగా తపస్సు.. యువకుడి వినూత్న నిరసన

by Ramesh Naini |

మండల ఆఫీస్‌లో ధరణి సమస్య పరిష్కరించాలని ఓ యువకుడు తలక్రిందులుగా తపస్సు చేస్తూ వినూత్న నిరసన తెలియజేశాడు.

Dharani Problem : ధరణి సమస్య పై తలక్రిందులుగా తపస్సు.. యువకుడి వినూత్న నిరసన
X

దిశ, డైనమిక్ బ్యూరో: మండల ఆఫీస్‌లో ధరణి సమస్య పరిష్కరించాలని ఓ యువకుడు తలక్రిందులుగా తపస్సు చేస్తూ వినూత్న నిరసన తెలియజేశాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల ఆఫీస్‌లో ధరణి సమస్య తీర్చాలంటూ 30 నిమిషాల పాటు శీర్షాసనం వేసి యువకుడు నిరసన తెలిపాడు. మంగళ్ పల్లి గ్రామంలో తనకు చెందిన 1.32 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంతో పాటు సీలింగ్ ల్యాండ్ అని రికార్డుల్లో ఎక్కించారని బాధితుడు జీవన్ తెలిపాడు.

8 నెలల నుంచి రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందని, దీంతో బాధితుడు తన భూమిని నిషేదిత జాబితా నుంచి తొలగించాలని బాధితుడు జీవన్ డిమాండ్ చేస్తూ శీర్షసనంతో నిరసన తెలియజేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, రాష్ట్రంలో ధరణి పోర్టల్ సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే భూ సమస్యల సమగ్ర పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్న విషయం విదితమే. ముఖ్యంగా ధరణి పోర్టల్ దరఖాస్తుల పరిష్కారంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో దరఖాస్తుల పెండింగ్‌లు అధికంగా ఉన్నాయని, పది రోజుల్లో ధరణి దరఖాస్తులు పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Next Story