బిగ్ బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
బిగ్ బ్రేకింగ్ : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం హాట్ టాపిక్ గా మారింది. విశాఖ ప్లాంట్‌లో బిడ్డింగ్‌కు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టిన నేపథ్యంలో కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా ఆలోచనలు చేయడం లేదని అన్నారు. గురువారం విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో రోజ్ గార్ మేళాకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిడ్డింగ్‌లో పాల్గొనాలనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఓ ఎత్తుగడ మాత్రమే అని వ్యాఖ్యానించారు.

ప్రైవేటీకరణ కంటే ముదే ఆర్ఎన్‌ఐఎల్‌ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్‌లో కొన్ని కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని, స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో పని చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముడిసరుకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి సారించామన్నారు. ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చిస్తామని చెప్పారు. కాగా ఓ వైపు ఈక్వీటీ బిడ్‌లో పాల్గొనడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. బిడ్డింగ్ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు సింగరేణి అధికారులు విశాఖలో పర్యటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ఉక్కు మంత్రి చేసిన తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇన్నాళ్లు ప్రైవేటీకరణలో వెనకడు వేసే ప్రసక్తే లేదన్న కేంద్రం.. తాజాగా ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదని చెప్పడం ఆసక్తికర పరిణామంగా మారింది.



Next Story

Most Viewed