ఎదిరిస్తే అధ:పాతాళానికి తొక్కేయడమే KCR లక్ష్యం: Union Minister Kishan Reddy సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
ఎదిరిస్తే అధ:పాతాళానికి తొక్కేయడమే KCR లక్ష్యం: Union Minister Kishan Reddy సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలన నిజాం పాలనను తలపిస్తోందని, నిజాం పాలనలో చూసిన అరాచకాలన్నీ కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్.. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని, తమను ఎదిరించేవారిని అధ:పాతాళానికి తొక్కేయడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు పనిచేస్తోందని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భరోసా కల్పించకుండా.. కల్వకుంట్ల కుటుంబం అహంకారపూరితంగా వ్యవహరిస్తుండటంతో.. ధరణి వంటి సమస్యలు మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

‘ధరణి’ అంశంపై తమకే తప్పు తెలియదన్నట్లుగా ఒక ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రికలో ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా ప్రకటన విడుదల చేయించారని ఆయన ఆరోపించారు. తమ తప్పు బయటపడొద్దని సదరు ప్రైవేట్ కంపెనీ వెనుక సర్కారు దాక్కున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ధరణి కారణంగా 75 లక్షల మంది రైతులు.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు, ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను కబ్జా చేస్తున్న వారినుంచి భరోసా కల్పించాల్సింది పోయి.. కేసీఆర్ తన అసమర్థతను మరోసారి బట్టబయలు చేసుకునేలా ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా ప్రకటన ఇచ్చుకోవడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు.

రైతుల పాత సమస్యలను తీర్చాల్సిందిపోయి.. కొత్త సమస్యలను సృష్టించి వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వీఆర్వోలను ధరణి వ్యవస్థలోకి చొప్పించి.. వారి సాయంతో ఈ వ్యవస్థను సరిగ్గా అమలుచేయాల్సింది పోయి ఆ వ్యవస్థనే రద్దుచేయడంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల కలెక్టర్లపై అదనపు భారం పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ‘స్వామిత్వ యోజన’ ద్వారా పేదలకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా ఆస్తి ధృవీకరణ పత్రాలను, టైటిల్ డీడ్‌లను అందజేస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గళమెత్తేవారిని అడ్డంగా తొక్కిపడేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.

ప్రభుత్వ వ్యతిరేకతను చూపించే వీ6, వెలుగు పత్రికను.. నిషేధించారని, గతంలోనూ వివిధ పత్రికలు, చానళ్లను బ్యాన్ చేశారన్నారు. తమ అసమర్థతను ప్రజలకు చూపించే చానళ్లను 10 కిలోమీటర్ల లోతున పాతిపెడతానన్న విషయం ఇంకా తెలంగాణ ప్రజలకు గుర్తుందని పేర్కొన్నారు. పాత్రికేయులెందరినో ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబసభ్యులు బహిరంగంగానే బెదిరించడం, అర్ధరాత్రి ఇళ్లపై దాడిచేసి అరెస్టులు చేయడం, కూరగాయలకు వెళ్తున్న వారిని పట్టుకుని మఫ్టీ పోలీసులతో కిడ్నాపులు చేయించి బెదిరించడం వంటివి ప్రజల కళ్లముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

Next Story

Most Viewed