NT రామారావును కొనియాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

by Gantepaka Srikanth |

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు(NTR)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

NT రామారావును కొనియాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత ఎన్టీ రామారావు(NTR)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నాంపల్లి కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 1970లో మొట్టమొదటి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకొచ్చారని గుర్తుచేశారు. ఆయన ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి.. చివరి వ్యక్తి వరకూ అందేలా కృషి చేశారని కొనియాడారు. ఆయనతో పాటు బిహార్‌(Bihar)లో మొట్టమొదటి కాంగ్రెస్సేతర ముఖ్యమంత్రిగా కర్పూరీ ఠాకూర్(Karpoori Thakur) కూడా ప్రజలకు అద్భుతమైన పాలన అందించారని చెప్పారు. భారతరత్న కర్పూరీ ఠాకూర్ సోషలిస్టు నాయకుడిగా అనేక విద్యార్థి ఉద్యమాలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అభ్యున్నతి కోసం ఉద్యమించారు.

శాసనసభ్యుడిగా, విద్యాశాఖ మంత్రిగా, రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన మహానుభావుడని కొనియాడారు. విద్యార్థి దశ నుంచే క్విట్ ఇండియా ఉద్యమం(Quit India Movement)లో దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి, 25 నెలల పాటు జైలు జీవితం గడిపిన గొప్ప వ్యక్తి అని అన్నారు. దేశానికి అధికారిక భాష ఉండాలని నమ్మినటువంటి వ్యక్తుల్లో కర్పూరీ ఠాకూర్ ప్రథముడు. మాతృభాషను పరిరక్షించుకునేలా హిందీ భాష ప్రోత్సాహానికి విశేష కృషి చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే నెహ్రూ కుటుంబంగా వ్యవహరించేవారు. భారతరత్న వంటి అవార్డులు ఆ పార్టీవారికే ఇచ్చుకున్నారు.

నాడు దేశంలో ఇందిరాగాంధీ(Indira Gandhi) పాలనకు వ్యతిరేకంగా జనతా పార్టీ(Janata Party) ద్వారా ఒక నిశ్శబ్ధ విప్లవం వచ్చింది. ఆ ఉద్యమంలో కర్పూరీ ఠాకూరీ పాత్ర మరువలేనిది. కులాలు, మతాలకు అతీతంగా దేశ సేవ కోసం పనిచేశారని తెలిపారు. 1970లోనే మొట్టమొదటిసారి బిహార్‌లో మద్యపాన నిషేధం తీసుకొచ్చారని అన్నారు. దేశంలో నెహ్రూ కుటుంబం తప్ప మరెవ్వరూ పరిపాలన చేయలేరు. మరెవరికీ ఆ హక్కు లేదని కాంగ్రెస్ భావించేదని విమర్శించారు. ఆ భావనతోనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను కూడా ఎన్నికల్లో ఓడించారని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేసిందని అన్నారు.

Next Story