తెలంగాణకు అమిత్ షా.. పొలిటికల్ హీట్ పెంచుతున్న కేంద్రమంత్రి టూర్!

by Disha Web Desk 19 |
Home Minister Amit Shah
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికార బీఆర్ఎస్‌కు ప్రతిపక్ష బీజేపీకి మధ్య పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే ఇరు పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్ షా తెలంగాణ టూర్ హాట్ టాపిక్‌గా మారుతోంది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్రంలో పర్యటించిన అమిత్ షా మరోసారి రాష్ట్రంలో పర్యటించబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 12న ఆయన తెలంగాణకు రాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికారిక కార్యక్రమంలో భాగంగా ఆయన హైదరాబాద్‌కు వస్తున్నట్టు కమలం పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది.

ఈ టూర్‌లో భాగంగా అఫీషియల్ కార్యక్రమంతో పాటు పార్టీ కార్యక్రమంలో కూడా పాల్గొంటారా అనేది ఆసక్తిగా మారింది. వచ్చే నెలలో పార్టీ పరంగా పలు కీలక కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో అమిత్ షా టూర్ ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీ కాలం మార్చి 11తో ముగియనుంది. అయితే బండి సంజయ్ ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటికే పార్టీ ఇన్ చార్జి తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పదవీ కాలం రెన్యువల్ టైమ్‌కు అమిత్ షా టూర్ ఉంటుందన్న ప్రచారం పార్టీ శ్రేణులకు జోష్ తెప్పిస్తోంది.

పార్టీలోకి పొంగులేటి?:

గత కొంత కాలంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందుకు మూహుర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మార్చి 12న అమిత్ షా టూర్ సందర్భంగా పొంగులేటి బీజేపీ కండువా కప్పుకోబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్‌తో దాదాపుగా తెగదెంపులు చేసుకున్న పొంగులేటి అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

Next Story

Most Viewed