ఆర్టీసీలో మహిళల ఫ్రీ జర్నీకి రెండేళ్లు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు, సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్టీసీలో మహిళల ఫ్రీ జర్నీకి రెండేళ్లు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు, ఆర్టీసీ ఉద్యోగులకు, సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 2023 డిసెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని అక్కచెల్లెలకు మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించిందని ఆయన తెలిపారు. నేటికి ఈ పథకం రెండేళ్లు పూర్తయింది. ఇప్పటి వరకు 251 కోట్ల ప్రయాణాలు (ట్రిప్స్) జరిగాయని వాటి మొత్తం విలువ రూ.8,459 కోట్లని తెలిపారు.

మహాలక్ష్మీ పథకం ద్వారా కుటుంబ బంధాలు పెరగడం, దేవాలయాల సందర్శన, ఆసుపత్రులకు చికిత్స, విద్యా వ్యవస్థలో పాల్గొనడం, ఉపాధి అవకాశాలు మెరుగుపడడం వంటి అనేక రకాలుగా మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభమైన ఈ పథకం రెండేళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ మహిళా సాధికారతకు బాటలు వేస్తోందని ఆయన అన్నారు. బస్సుల్లో ప్రయాణం మాత్రమే కాకుండా, మహిళలను బస్సుల యజమానులుగా చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని పేర్కొన్నారు. పథకం సక్రమంగా అమలు అయ్యేలా సహకరిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

Next Story