ఇద్దరు టాప్ లీడర్లు జంప్! ఆ జిల్లాలో బీఆర్ఎస్‌ ఖతం?

by Disha Web Desk 4 |
ఇద్దరు టాప్ లీడర్లు జంప్! ఆ జిల్లాలో బీఆర్ఎస్‌ ఖతం?
X

దిశ, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు గులాబీ టాప్ లీడర్లు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్‌లో వివిధ హోదాలు, పదవులు అనుభవించినా.. ప్రస్తుతం ఆ పార్టీలో భవిష్యత్తు కనిపించని నేపథ్యంలో.. పార్లమెంట్ ఎన్నికల్లోపే కండువా మార్చేయడం బెటర్ అనుకుంటున్నారు. రాజకీయ అండదండలు లేకపోతే ఇబ్బందులు తప్పవని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. మొదట కాంగ్రెస్‌లో చేరాలని భావించినా... ఆ పార్టీ ఆసక్తి చూపకపోవడంతో బీజేపీలో చేరడానికి సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. దీంతో ఉమ్మడి ఖమ్మంలో బీఆర్ఎస్ ఖతం అనే చర్చ జరుగుతున్నది.

కాంగ్రెస్ నుంచి రెడ్ సిగ్నల్..

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పెద్ద ఎత్తున ఆ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. అయితే ఉమ్మడి ఖమ్మంకు చెందిన ఈ ఇద్దరు నాయకులు సైతం అధికార పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబర్చినట్లు తెలిసింది. అయితే వీరితో పాటు, వారి అనుచరులపై సైతం అవినీతి, అక్రమాల ఆరోపణలు ఉండడంతో వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ స్పష్టం చేసినట్లు తెలిసింది.

కేసుల భయం.. ఆస్తులు కాపాడుకోవడానికేనా?

ఈ ఇద్దరు నేతల్లో ఒకరిపై, అతని అనుచరులపై తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వారిని కేసుల భయం వెంటాడుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా సంపాదించిన ఆస్తుల మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉండటంతో పార్టీ మార్పు అనివార్యమని భావిస్తున్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ ‘నో’ చెప్పడంతో ఆ ఇద్దరు నాయకులు బీజేపీ కీలక నేతతో ప్రాథమిక చర్చలు జరిపినట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రాష్ట్రంలో అధికార పార్టీ అక్రమాలపై విచారణ చేపట్టినా.. కేంద్రంలో బీజేపీ గెలిస్తే సపోర్టు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బీజేపీ నాయకులతో టచ్‌లోకి వెళ్లారని, వారి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారని నాయకులకు ఆప్తులైన అనుచరులు చెబుతున్నారు. అయితే ఆ ఇద్దరిలో ఒకరిపై పార్టీ నాయకత్వం సానుకూలంగా ఉందని, మరో నాయకుని విషయంలో వెనుకడుగు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.

ఆ పార్టీ నుంచే పోటీ చేస్తారా..

పార్లమెంట్ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో జాతీయ పార్టీ నుంచే బరిలో నిలవాలని ఆ ఇద్దరు నేతలు అనుకుంటున్నట్లు సమాచారం. ఒకరు జిల్లాలోని పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తుంటే.. మరొకరు హైదరాబాద్ పరిధిలోకి షిఫ్ట్ కావాలని అనుకుంటున్నట్లు తెలిసింది. పార్టీ మారి పదవి దక్కించుకుంటేనే భవిష్యత్తులో మనగలుగుతామని, లేకపోతే ఇబ్బందులు తప్పవనే ఆలోచన వీరిని వెంటాడుతున్నట్లు టాక్.

బీఆర్ఎస్‌కు భారీ కుదుపే..

అధికారం కోల్పోయాక ఒకరిద్దరు మాజీలు మినహా జిల్లాలో కనిపించే నాయకులే కరువయ్యారు. ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను కాపాడుకోవడం అటుంచితే.. భరోసా కల్పించే నాయకులు లేక ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. తాజాగా నలుగురు కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలో టాప్ లీడర్లుగా ఉన్న ఇద్దరూ పార్టీ మారితే జిల్లా బీఆర్ఎస్ పార్టీకి భారీ కుదుపుగానే భావిస్తున్నారు.

Also Read..

MP ఎన్నికల వేళ పీకల్లోతూ కష్టాల్లో బీఆర్ఎస్.. KCR ఎంట్రీ ఇవ్వకుంటే భారీ నష్టం తప్పదా..?

Next Story