పిల్లలను చంపి తండ్రి సూసైడ్ కేసులో ట్విస్ట్.. ఐదుగురు రిపోర్టర్లతో నిందితుడిగా హోంగార్డు

by Disha Web Desk 13 |
పిల్లలను చంపి తండ్రి సూసైడ్ కేసులో ట్విస్ట్.. ఐదుగురు రిపోర్టర్లతో నిందితుడిగా హోంగార్డు
X

దిశ, డైనమిక్ బ్యూరో:రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల పోలీస్ స్టేషన్ పరిధి టంగుటూరు గ్రామంలో ఓ తండ్రి తన ముగ్గురు కుమారులను హత్య చేసి తాను ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలొ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుల్లో ఐదుగురు రిపోర్టర్లతో పాటు ఒక హోంగార్డు సైతం ఉన్నట్లు పోలీసులు వివరించారు. నీరటి రవి అనే వ్యక్తి ఈ నెల 3వ తేదీన తన కుమారులను హత్య చేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే రవి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఈ కేసులో ఏ1- తిరుపతి రావు, ఏ2- మంగలి శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి రిపోర్టర్), ఏ3- కురుమ శ్రీనివాస్ (ఈనాడు రిపోర్టర్), ఏ4- వడ్డే మహేష్ (నమస్తే తెలంగాణ రిపోర్టర్), ఏ5- సిరిపురం శ్రీనివాస్ రెడ్డి-(వార్తా రిపోర్టర్), ఏ6 - సంకే ప్రవీణ్ కుమార్- (సాక్షి రిపోర్టర్), ఏ7 - ఆలూరు రాజు (హోం గార్డు), ఏ8 - మనీలా, ఏ9 - రామకృష్ణలు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం అసలేం జరిగిందంటే:

నీరటి రవి ఓ అగ్రికల్చర్ ఆఫీస్ లో సూపర్ వైరజర్ గా పని చేసే సమయంలో 2022లో కంపెనీ పనిమీద ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు వెళ్లాడు. అక్కడ మనీ సర్క్యులేషన్ కు సంబంధించిన జీఎస్ఎన్ ఫౌండేషన్ ప్రతినిధి తిరుపతిరెడ్డితో రవికి పరిచయం ఏర్పడింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయని రవిని అందులో తిరుపతి రెడ్డి చేర్పించాడు. ముందుగా రూ.2 వేలు కడితే 45 రోజుల తర్వాత కట్టిన డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చి ఆ తర్వాత ప్రతినెల రూ. 1000 చొప్పున ఆరు నెలల వరకు ఇచ్చేవారు. డబ్బులు తిరిగి వస్తుండటంతో రవి తన గ్రామాస్తులతో పాటు తన పరిచయస్తులను ఈ స్కీమ్ లో చేర్పించాడు. వారి వద్ద నుంచి సేకరించిన డబ్బులను రవి తిరుపతిరావుకు పంపించేవాడు. ఈ క్రమంలో 8 నెల్ల క్రితం రవి తన గ్రామంలో 0.39 గుంటల భూమిని కొనుగోలు చేసి అందులో తన ముగ్గురు పిల్ల పేరుమీద ఎస్.ఎం.యూ ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నారు. అయితే గత మూడు నెలల నుంచి జీఎస్ఎన్ ఫౌండేషన్ తరపున తిరుపతిరావు డబ్బులు చెల్లించడం మానేశాడు. దీంతో డబ్బులు కట్టిన వారంతా తమ డబ్బులు ఇచ్చేయాలని రవిపై తరచూ ఒత్తిడి తీసుకువచ్చారు.

ఈ విషయం తెలుసుకున్న నిందితులైన విలేకర్లు తమకు రూ.20 లక్షలు ఇవ్వాలని రవిని బెదిరించారు. లేకపోతే జీఎస్ఎన్ ఫౌండేషన్ పేరు మీద పబ్లిక్ వద్ద డబ్బులు కట్టించి వారికి తిరిగి ఇవ్వకుండా మోసం చేశావని, అలాగే ప్రభుత్వ భూమిలో ఫంక్షన్ హాల్ కడుతున్నావని వార్తలు రాస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో ఫిబ్రవరి 19న తన భార్య బంగారు పుస్తెల తాడు, గొలుగులు తాకట్టు పెట్టి 2,50,000 సదరు రిపోర్టర్లకు ఇచ్చాడు. ఇదే సమయంలో శంకర్ పల్లికి చెందిన నాగరాజు (రాజు) అతని భార్య మనీల కూడా జీఎస్ఎన్ సంస్థలో పెట్టుబడి పెట్టారు. వారు కూడా తమ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో రవి తన భార్య పేరుపై రావుల పల్లి గ్రామంలో అంతకు ముందే కొనుగోలు చేసిన రెండు ప్లాట్ల దస్తావేజులు మరొకరి వద్ద తాకట్టు పెట్టి రూ.18,00,000 తీసుకువచ్చి నాగరాజుకు ఇచ్చాడు. ఈ క్రమంలో మిగతా డబ్బుల కోసం విలేకరులు ఒత్తిడి చేయడంతో భరించలేకపోయిన రవి ఆత్మహత్య చేసుకోవాలని భావించిన రవి తాను చనిపోతే తన పిల్లలు అనాథలు అవుతారని భావించి ఫిబ్రవరి 3వ తేదిన రాత్రి తన ముగ్గురు కుమారుల మెడకు తాడు బిగించి చంపేశారు. అనంతరం తాను కట్టిస్తున్న ఫంక్షన్ హాల్ వద్ద రేకుల షెడ్డులో తాను ఊరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.

పోలీసుల హెచ్చరిక:

ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్న రిపోర్టర్లకు హెచ్చరిక జారీ చేశారు. విలేకర్లు, మరే ఇతర రంగాలకు చెందిన వ్యక్తులు ఎవరినైనా బెదిరించి డబ్బులు వసులూ చేసినా, అలా చేయడానికి ప్రయత్నించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అధిక డబ్బులు వస్తాయని దురాశతో మోసపూరిత స్కీమ్ లు, ఆన్ లైన్ యాప్ లలో డబ్బులు పెట్టి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.

Next Story