తెలంగాణలో అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ.. పొత్తులపై కాసాని క్లారిటీ

by Disha Web Desk 2 |
తెలంగాణలో అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ.. పొత్తులపై కాసాని క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులుండవని.. ఒంటరిగానే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. ఇంటింటికీ టీడీపీతో గడపగడపకు వెళ్తున్నామని పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో మంగళవారం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు 17 అంశాలను చర్చించారు. ఏపీకి చెందిన 13 అంశాలు, తెలంగాణకు చెందిన 4 అంశాలపై కూలంకశంగా చర్చించారు. అనంతనం కాసాని మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పెరిగిన ధరలు, డబుల్ బెడ్రూం ఇళ్లపంపిణీ, ధరణి పలు అంశాలపై చర్చించామన్నారు. ప్రజా సమస్యలపై ఉధృతంగా పోరాటం చేయాలని నిర్ణయించామని తెలిపారు.

వడగండ్ల వానతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకొని భరోసా ఇవ్వాలని, కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. ఎన్టీఆర్ శతజయంత్యుత్సవాలను రాష్ట్రంలోని 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో క్యాడర్‌లో ఉత్సాహం ఉరకలేస్తోందన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని గ్రామస్థాయిలో నిర్వహిస్తున్నట్లు వివరించారు. టీడీపీతో పొత్తు ఉంటుందని బీజేపీ నేతలు పేర్కొనడం సంతోషకరమన్నారు. కానీ పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఏపీలో పేదరిక నిర్మూలనకు ప్రతి కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని వారిని ధనవంతులుగా చేసేందుకు కేంద్రీకరించనున్నామన్నారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు యువతపై దృష్టిసారించామన్నారు. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామన్నారు. యువతకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎన్టీఆర్ శతజయంతిని ఈనెల 30 నుంచి మే 28 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో, దేశంలో ప్రపంచంలో వంద సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రూ.100 వెండి నాణెంను విడుదల చేయాలని నిర్ణయించిన కేంద్రానికి, పీఎం మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ సీఎం జగన్ 2019లో సైకిల్ గుర్తుపై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలను ఎంతపెట్టి కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీలో తిరిగే స్వేచ్చలేదు.. వాక్ స్వాతంత్ర్యం లేదు.. నారా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని ఏపీ ప్రభుత్వం జీవో 1ను తీసుకొచ్చిందని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్‌లో ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. మేలో మహానాడు ఏర్పాట్లపై కమిటీ, శతజయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ, టీడీపీ మేనిఫెస్టో కు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి వచ్చే పార్టీలో ముందుకెళ్తామన్నారు. నలుగురుకాదు.. 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సంప్రదింపులు చేస్తున్నారన్నారు. బహిష్కరించిన ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు చర్చలు జరుపులేదని, వారిని తీసుకునేందుకు సిద్ధంగా లేమన్నారు. జగన్ కు మైండ్ పనిచేయకపోవడంతో రోజుకో మాట మాట్లాడుతున్నాడమని మండిపడ్డారు. ఆంధ్రను అమ్మేస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఎంపీ సభ్యత్వ రద్దును ఖండిస్తున్నామన్నారు. సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.



Next Story

Most Viewed