ఒడిశాకు టీఎస్‌ ఆర్టీసీ బస్సు సర్వీసులు..

by Disha Web Desk 11 |
ఒడిశాకు టీఎస్‌ ఆర్టీసీ బస్సు సర్వీసులు..
X

దిశ, ముషీరాబాద్: ఒడిశాకు బస్ సర్వీసులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో 10 బస్సులను తిప్పేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర బస్‌ సర్వీసుల ఏర్పాటుపై ఒడిశా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఓఎస్ఆర్టీసీ) తో టీఎస్ ఆర్టీసీ ఒక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ బస్ భవన్ లో బుధవారం జరిగిన కార్యక్రమంలో టీఎస్ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ సమక్షంలో సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఓఎస్ ఆర్టీసీ ఎండీ దిప్తేష్‌ కుమార్‌ పట్నాయక్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వాటిని పరస్పరం అందజేసుకున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం.. టీఎస్‌ఆర్టీసీ 10 బస్సులను ఒడిశాకు. ఓఎస్‌ ఆర్టీసీ 13 సర్వీస్‌లను తెలంగాణకు నడపనుంది. ఈ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ తీసుకొచ్చిన పలు కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా ఓఎస్‌ ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా సజ్జనార్ వివరించారు. తెలంగాణ-ఒడిశా మధ్యలో ప్రయాణికులు ఎక్కువగా రాకపోకలు సాగిస్తుంటారని, డిమాండ్‌ నేపథ్యంలో ఓఎస్‌ ఆర్టీసీతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకున్నట్లు టీఎస్‌ ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌ తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వినోద్ కుమార్, సీపీఎం కృష్ణకాంత్‌, సీటీఎం జీవనప్రసాద్‌, సీఎంఈ రఘునాథరావు, ఐటీ చీఫ్‌ ఇంజనీర్‌ రాజశేఖర్‌, సీటీఎం (ఎం అండ్‌ సీ) విజయ్‌ కుమార్‌, బిజినెస్‌ హెడ్‌ (లాజిస్టిక్స్‌) సంతోష్‌ కుమార్‌, చీఫ్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌) విజయ పుష్ఫతో పాటు ఓఎస్‌ఆర్టీసీ ఓఎస్డీ దీప్తి మహాపాత్రో, ట్రాన్స్‌ఫోర్ట్‌ ప్లానర్‌ సందీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed