ధర్మపురి రీ కౌంటింగ్‌లో బిగ్ ట్విస్ట్

by Disha Web Desk 4 |
ధర్మపురి రీ కౌంటింగ్‌లో బిగ్ ట్విస్ట్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి : ధర్మపురి రీ కౌంటింగ్ విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.ఈవిఎం లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి సంబంధిత పత్రాల కాపీలను సబ్మిట్ చేయాల్సిందింగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారంటూ ఆరోపిస్తూ రీ కౌంటింగ్ చేయాల్సిందిగా కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఇరుపక్షాల వాదనలను అభ్యర్థులు తరపు న్యాయవదులు కోర్టు ముందు ఉంచారు. కోర్టు తాజా ఉత్తర్వుల మేరకు జగిత్యాల జిల్లా నూకపెల్లి శివారులో గల వి.ఆర్.కె ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా కలెక్టర్ ఈ రోజు(సోమవారం)ఉదయం 10 గంటలకు కోర్టు స్ట్రాంగ్ రూమ్ ను సంబంధిత అధికారులతో పాటు కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో తెరవాల్సి ఉండగా స్ట్రాంగ్ రూమ్ తాళాలు దొరకకపోవడంతో చివరి నిమిషంలో ఉత్కంఠ గా మారింది.

చివరి నిమిషంలో..

వి ఆర్ కె ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న ఈవీఎం స్ట్రాంగ్ రూమును ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్, అభ్యర్థుల సమక్షంలో 10 గంటలకు ఓపెన్ చేసి ప్రక్రియను ప్రారంభించాల్సి ఉండగా చివరి నిమిషంలో స్ట్రాంగ్ రూమ్ తాళాలు దొరకకపోవడంతో గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. అయితే స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగలగొట్టి ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం ససేమిరా అంటున్నారు. జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ వద్ద భద్రంగా ఉండాల్సిన తాళాలు ఎందుకు కనిపించకుండా పోతాయని రెండు సెట్లుగా ఉండాల్సిన తాళాలు ఒకరి దగ్గర కాకపోయినా మరొకరి దగ్గర ఉండాలి కదా అంటూ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ అధికారుల తీరుపై అగ్రహం వ్యక్తం చేసారు.స్ట్రాంగ్ రూమ్ తాళాలు దొరకని పక్షంలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు నడుచుకోవాలని పట్టుబడుతున్నారు.

స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ అయితే..

తాళాలు దొరికి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసిన పక్షంలో గత అసెంబ్లీ ఎన్నికలలో ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ల లోని 258 ఈవీఎంలలో గల సమాచారాన్ని కోర్టుకు పంపించనున్నారు. ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో కీలకమైన 17A తో పాటు 17C పత్రాలను జిరాక్స్ తీసి అటెస్ట్ చేసిన ఆ కాపీలను హైకోర్టుకు సమర్పించినట్లు జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష తెలిపారు. వాటితో పాటుగా ఎన్నికలు నిర్వహించిన సరళని సిసి ఫుటేజ్ కాపీలను కూడా కోర్టుకు సమర్పిస్తామని వివరాలు వెల్లడించారు.


Next Story

Most Viewed