ఉపాధ్యాయ పురస్కారాలలో భాషా పండితులకు అవకాశం కల్పించాలి.. ఆర్యూపీపీ డిమాండ్

by Dishafeatures2 |
ఉపాధ్యాయ పురస్కారాలలో భాషా పండితులకు అవకాశం కల్పించాలి.. ఆర్యూపీపీ డిమాండ్
X

దిశ , తెలంగాణ బ్యూరో : రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార ప్రధాన జాబితాలో గ్రేడ్ 2 భాషా పండితులకు అవకాశం కల్పించాలని తెలంగాణ రాష్టీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు చింతకుంట జగదీష్ బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాలుగా అవకాశం లేకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ పురస్కారాలలో భాషా పండితులకు భాగస్వామ్యం కల్పించాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణకు విజ్ఞప్తి చేసినట్టు ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విశేషమైన సేవలు అందించి జిల్లాస్థాయిలో పురస్కారాలు అందుకున్న అనేకమంది భాషాపండితుల వివరాలు రాష్ట్రస్థాయి పురస్కారాలకు జిల్లాలనుండి నామినేషన్లు పంపించిన వాటిని పరిగణించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం ఎంపికచేసే రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల గ్రహీతల జాబితాలో గ్రేడ్ 2 భాషాపండితులకు సముచిత స్థానం కల్పించాలని కోరుతూ అధికారులకు తగు సూచనలు ఇవ్వాలని మంత్రిని కోరినట్టు అయన తెలిపారు.


Next Story