బందోబస్తు ఉన్నా టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. పోలీసుల తీరుపై షర్మిల ఫైర్

by Disha Web Desk 4 |
బందోబస్తు ఉన్నా టీఆర్ఎస్ కార్యకర్తల దాడి.. పోలీసుల తీరుపై షర్మిల ఫైర్
X

దిశ,చెన్నరావుపేట: పోలీస్ బందోబస్తు ఉన్నా టీఆర్ఎస్ కార్యకర్తల దాడి పట్ల షర్మిల ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ గుండాలు పెట్రోల్ దాడి చేసినంత మాత్రాన ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని వై.ఎస్ షర్మిల స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల అనుమతులు తీసుకున్నాకనే ప్రజాప్రస్థాన యాత్ర చేపట్టినట్లు ఆమె తెలిపారు. ప్రజా సమస్యలపై ఏ పార్టీ చేయని రీతిలో పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రజామద్దతు వైఎస్ఆర్ టీపీకి దక్కిందన్నారు. ఇది తట్టుకోలేని టీఆర్ఎస్ ప్రభుత్వం తన ప్రజా ప్రస్థాన పాద యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. తన యాత్రకు అడ్డంకులు ఉన్నాయని పోలీసులు ముందే చెప్పారని, ఐతే తన వాహనంపై పెట్రోల్ దాడిని ఎందుకు ఆపలేకపోయారని ఆమె ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆదేశాలను పోలీసులు అమలు చేస్తున్నారని ఆరోపించారు.

తనకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. తన యాత్రలో అడ్డంకులు సృష్టించి ప్రజా సమస్యలు వెలుగులోకి రాకుండా చూస్తున్నారని ఆమె అన్నారు. టీఆర్ఎస్ గుండాల దాడికి భయపడి ప్రజా ప్రస్థాన పాద యాత్రను ఆపబోయేది లేదని ఆమె స్పష్టం చేశారు. టీఆర్ఎస్ అవినీతి పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని తన పాదయాత్రకి వచ్చిన స్పందన ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టమైందన్నారు. ఇదంతా మింగుడు పడని ప్రభుత్వం అడ్డుకునే కుటిల యత్నాలు చేస్తున్నదని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా వైఎస్ఆర్ టీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దాడి చేసిన టీఆర్ఎస్ గుండాలని అరెస్ట్ చేసి హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ బందోబస్తు‌ పెద్ద ఎత్తున ఉన్నా కారులో వచ్చి పెట్రోల్ దాడి చేస్తే పోలీసులు చోద్యం చూసారా అని ప్రశ్నించారు.


Next Story

Most Viewed