విషాదం.. ట్రాఫిక్ పోలీసులు బండి లాక్కెళ్లారని వ్యక్తి సూసైడ్

by Disha Web Desk 4 |
విషాదం.. ట్రాఫిక్ పోలీసులు బండి లాక్కెళ్లారని వ్యక్తి సూసైడ్
X

దిశ, హనుమకొండ టౌన్ : ఆదివారం రాత్రి ఓ ద్విచక్ర వాహనదారుడిని వరంగల్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. 15 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉండడంతో ఆ వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వ్యక్తి ఇంట్లోనే గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లిలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాలకుర్తి మొగిలి(52) వరంగల్‌లోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ మెన్‌గా పని చేస్తున్నారు. ఈనెల 21న రాత్రి పని ముగించుకుని గ్రామానికి తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వరంగల్‌లో ట్రాఫిక్ ఎస్సైతో పాటు సిబ్బంది ఆపి ఆ వాహనంపై ఉన్న చలాన్లను పరిశీలించారు. 15 చలాన్లు ఉన్నట్లు గుర్తించి వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు.

తర్వాత చెల్లిస్తానని మొగిలి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. బాధితుడు రాత్రిపూట నడుచుకుంటూ ఇంటికి వెళ్లారు. మనస్తాపానికి గురై మరుసటి రోజు ఉదయం గడ్డి మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. గుర్తించిన కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం తెల్లవారుజామున మృతిచెందారు. ట్రాఫిక్ పోలీసుల కారణంగానే మొగిలి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇందుకు కారణమైన ట్రాఫిక్ ఎస్సైతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు హసన్‌పర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


Next Story

Most Viewed