టీ-కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. రేవంత్‌కు మరో కొత్త తలనొప్పి!

by Disha Web Desk 2 |
టీ-కాంగ్రెస్ సంచలన నిర్ణయం.. రేవంత్‌కు మరో కొత్త తలనొప్పి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్​కమిటీని జంబో టీంగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా 230 మందిని సభ్యులుగా నియమించనున్నారు. ప్రతి సెగ్మెంట్​నుంచి ఇద్దరికి అవకాశం కల్పించనున్నారు. దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే ఏఐసీసీకి పంపించారు. కేరళలో జరుగుతున్న భారత్​జోడో యాత్రకు వెళ్లిన టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి.. టీపీసీసీ విస్తరణను రాహుల్‌కు వివరించారు. అక్కడ అనుమతి తీసుకున్నారు. దీనిలో కొన్ని జిల్లాల డీసీసీ చీఫ్‌లను మార్చనున్నారు. ఈ నేపథ్యంలోనే గాంధీభవన్‌లో బుధవారం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులతో పాటుగా టీపీసీసీ కమిటీని, కొత్తగా సభ్యులగా నియామకం చేసే వారిని కూడా ఆహ్వానించారు. కొత్తగా వేసే జంబో కమిటీపై వీరితో చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు జిల్లా సారథులను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుండటంతో.. కొన్ని జిల్లాల నుంచి అసంతృప్తి కూడా మొదలైంది. పలువురు నేతలు పీసీసీ మాజీ చీఫ్​ఉత్తమ్‌తో పాటుగా పలువురు సీనియర్ల దగ్గర మొర పెట్టుకుంటున్నారు. ఇప్పుడే తమ పదవిని మార్చవద్దంటూ కోరుతున్నారు. ప్రస్తుత పరిణామాల్లో రేవంత్​రెడ్డికి పార్టీ పదవుల రూపంలో కొత్త తలనొప్పి కూడా మొదలుకానుందని గాంధీభవన్​వర్గాల్లో చర్చ సాగుతోంది.

డీసీసీల మార్పు

దాదాపు ఏడాదిన్నర తర్వాత టీపీసీసీ, డీసీసీలకు కొత్త కమిటీలను ఎంపిక చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి రెండు నెలల కిందటే జిల్లా అధ్యక్షులను మార్చేందుకు జాబితా సిద్ధం చేశారు. కానీ, రాష్ట్ర నేతల మధ్య వివాదాల నేపథ్యంలో వాయిదా పడుతోంది. తాజాగా టీపీసీసీ సభ్యులను నియమించేందుకు ఏఐసీసీ పర్మిషన్​ ఇవ్వడంతో.. చాలా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఏండ్ల నుంచి డీసీసీ చీఫ్‌లుగా ఉన్న వారిని మార్చనున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల పాత వర్గం ఉండటంతో.. రేవంత్​ వర్గానికి ఇబ్బందులు వస్తున్నాయనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే 11 జిల్లాలకుపైగా డీసీసీ అధ్క్ష్యక్షులను మార్చాలని ప్రతిపాదించారు. ఇక్కడ రేవంత్​ వర్గానికి బాధ్యతలు అప్పగిస్తారని సీనియర్లలు అభిప్రాయపడుతున్నారు.

టీపీసీసీ జంబో టీం

చాలా రోజుల తర్వాత టీపీసీసీ సభ్యులుగా వందల సంఖ్యలో నేతలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 230 మందికిపైగా టీపీసీసీ సభ్యులు ఉండే చాన్స్​ఉంది. ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు నేతలను టీపీసీసీలోకి తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్​పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే టీపీసీసీకి పూర్తిస్థాయి కమిటీ ఉంది. అనుబంధ కమిటీలు కూడా ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఈ కమిటీల్లో చాలా ఖాళీలున్నాయి. పార్టీ పదవులకు రాజీనామా చేసి ఇతర పార్టీలోకి వెళ్లారు. గతేడాది జూన్‌లో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్​ రెడ్డి నియామకం తర్వాత టీపీసీసీ పూర్తిస్థాయి కమిటీని కూడా త్వరలోనే ప్రకటిస్తారని భావించారు. కానీ, రాష్ట్ర నేతల గొడవల్లో కమిటీల నియామకం మరుగునపడుతోంది. వచ్చే కాలాన్ని పూర్తిగా ఎన్నికల కాలంగా భావిస్తున్న నేపథ్యంలో భారీ సంఖ్యలో నేతలను కమిటీల్లో సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. దీంతో పలు జిల్లాల సారథులను మార్చి, వారికి టీపీసీసీలో స్థానం కల్పించే అవకాశం ఉంది.

నేడు కీలక సమావేశం

టీపీసీసీ సభ్యుల నియామకంతో పాటుగా కొన్ని జిల్లాల అధ్యక్షుల మార్పుపైనా ఆయా నేతలతో చర్చించేందుకు టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో బుధవారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. డీసీసీ చీఫ్‌లతో పాటుగా టీపీసీసీ సీనియర్​ఉపాధ్యక్షులు, వర్కింగ్​ప్రెసిడెంట్లు, టీపీసీసీ శాశ్వత ఆహ్వానితులతో పాటుగా కొత్తగా సభ్యులుగా అవకాశం ఇస్తున్న నేతలను కూడా ఈ సమావేశానికి పిలిచారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు కూడా రానున్నట్లు తెలుస్తోంది.

మళ్లీ లొల్లి..?

రాష్ట్రంలో సీనియర్లు వర్సెస్​రేవంత్​వర్గం విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. అటు జగ్గారెడ్డి దసరా టార్గెట్‌గా ఏం చేస్తాడనే ఉత్కంఠ నెలకొంది. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు చాలా ప్రతిష్టాత్మకమైనా.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అటువైపు వెళ్లడం లేదు. ఇటీవల కొంతమేరకు సీఎల్పీ నేత భట్టితో పాటుగా పలువురు సీనియర్లు మునుగోడు బాట పట్టారు. ఈ నెల 18 తర్వాత మునుగోడులోనే మకాం వేస్తానన్న రేవంత్​రెడ్డి ఇంకా వెళ్లడం లేదు. పార్టీ కమిటీ విస్తరణ నేపథ్యంలో అటు ఢిల్లీకి.. ఇటు జోడో యాత్రలో ఉన్న రాహుల్​దగ్గరకు వెళ్లి వస్తున్నారు. మునుగోడు అంశంలో కాంగ్రెస్‌లో విభేదాలు కూడా వస్తున్నాయి. ఇలాంటి పరిణామాల్లో కొన్ని జిల్లాల అధ్యక్షులను మార్చితే అసంతృప్తి బయటకు వస్తుందనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. టీపీసీసీ సభ్యులుగా ఎవరికి చాన్స్​ఉంటుందనే విషయం బుధవారం కొంతమేరకు క్లారిటీ రానుంది. దీంతో వారికి జిల్లా బాధ్యతలు తొలిగించినట్లేననే సంకేతాలు స్పష్టం కానున్నాయి. దీంతో రేవంత్‌పై విమర్శలు వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు.



Next Story

Most Viewed