నమస్తే తెలంగాణకు రూ.100 కోట్ల భూమిని అక్రమంగా కట్టబెట్టారు.. రేవంత్ రెడ్డి

by Dishafeatures2 |
నమస్తే తెలంగాణకు రూ.100 కోట్ల భూమిని అక్రమంగా కట్టబెట్టారు..  రేవంత్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: నమస్తే తెలంగాణకు అక్రమంగా ప్రభుత్వ భూమిని ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పనంగా దామోదర్​రావుకు 2,704 గజాల భూమిని అప్పగించినట్లు చెప్పారు. బుధవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడుతూ.. రూ.100 కోట్లు విలువ చేసే భూమిని కేవలం రూ.17 కోట్లకే ఇచ్చారన్నారు. దీంతో పాటు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. కేసీఆర్ ​హైదరాబాద్ నగరంలో చేస్తున్న విధ్వంసాన్ని మీడియా సాక్షిగా నిరూపించేందుకు సిద్ధంగా ఉన్ననని రేవంత్ సవాల్​ విసిరారు. “కేసీఆర్ కుటుంబ స్వార్థానికి హైదరాబాద్ నగరాన్ని బలైంది. 9 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ నగరం విధ్వంసానికి గురైంది. తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ కుటుంబం కోసమేనా? నిజాం కూడా హైదరాబాద్ నగరంలో ఇంత విధ్వంసం సృష్టించలేదు” అని కేసీఆర్ కుటుంబంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.

ఈ రెండు ప్రాంతాల్లో ప్రత్యేక రూల్స్​..

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని నిర్మాణాలకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయని రేవంత్ గుర్తు చేశారు. ఎత్తయిన ప్రదేశాలు కావున విమానాల రాకపోకలకు అడ్డురాకుండా నిర్మాణాల కోసం ఎయిపోర్ట్ సంస్థ వారి పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అందుకే కేబీఆర్​ పార్క్ చుట్టూ కమర్షియల్ కాంప్లెక్స్ లు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. రూల్స్​ ప్రకారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి 3 అంతస్థులకు, కమర్షియల్ నిర్మాణాలకు 5 అంతస్థులకు మాత్రమే అనుమతి ఇచ్చేవారని తెలిపారు. కేబీఆర్ పార్కును ఎకో టూరిజం, ఎకో సెన్సిటివ్ జోన్ గా పరిగణిస్తారన్నారు. అందుకే దాని చుట్టూ కూడా ప్రత్యేక నిబంధనలు ఉంటాయన్నారు. కానీ కేసీఆర్ వచ్చాకే కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మాణాలు పెరిగాయన్నారు. కేబీఆర్ పార్కు నుంచి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లే దారిలో బీసీ స్టడీ సర్కిల్ సమీపంలో నిజాం నవాబులకు చెందిన ఒక హెరిటేజ్ భవనం ఉండేదని, ఈ భవనాన్ని కుర్ర శ్రీనివాస రావుకు చెందిన కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ అనే సంస్థ కొనుగోలు చేసిందన్నారు. దాన్ని నిబంధనలకు విరుద్ధంగా కూలగొట్టగా, గతంలో కాంగ్రెస్​ శాసనసభ్యుడు సంపత్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారన్నారు. అక్కడ ఏరియా 7415 గజాలు ఉండగా.. 500 గజాలు రోడ్డు వెడల్పు పోగా 6,900 గజాలు మిగిలిందన్నారు.

గత నిబంధనలకు ఇందులో 1200 గజాలు గ్రీన్ బెల్ట్​, మిగిలిన 5,800 గజాలకు 60 వేల చదరపు అడుగులకు మాత్రమే అనుమతి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. 2016లో కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ యజమాని భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోగా, టీఆర్ఎస్ నేతలు బెదిరించి అందులో 2,704 గజాల భూమిని నమస్తే తెలంగాణ ఎండీ, చైర్మన్ దామోదర్ రావు పేరు మీద రాయించుకున్నట్లు ఆరోపించారు. 2019లో రెండో సారి ప్రభుత్వం వచ్చాక శ్రీనివాస రావు ఆస్తిని బదలాయించారన్నారు. దాని ప్రతిఫలంగా పాత నిబంధనల మేరకు 5 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇవ్వని చోట.. 21 అంతస్తులకు పర్మిషన్ ఇచ్చారని తెలిపారు.3 వేల గజాల స్థలంలో 21 అంతస్థులకు ఎలా? పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు.ఇక రూల్స్​ప్రకారం5 అంతస్థుల కంటే ఎక్కువ అనుమతి ఇవ్వకూడదు. కానీ నమస్తే తెలంగాణ భూమి రాసిచ్చాక కేఎస్ అండ్ సీఎస్ డెవలపర్స్ సంస్థకు 4 అంతస్తులు భూమిలోపల, గ్రౌండ్ ఫ్లోర్, 16 అంతస్తులు భూమి పైన కట్టుకునెలా మొత్తం 21 అంతస్థులకు అనుమతులు ఇవ్వడం విచిత్రంగా ఉన్నదన్నారు. హైదరాబాద్ నగరంలో ఇంత విధ్వంసానికి కారణమవుతున్న కేసీఆర్, కేటీఆర్, సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్, వెంకట్రామిరెడ్డి, వీళ్లలో ఎవ్వరినీ వదిలే ప్రసక్తి లేదని రేవంత్ హెచ్చరించారు. 20 శాతం భూములు రాసిచ్చిన వారికే నిర్మాణాలకు అనుమతిచ్చారని ఆరోపించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story