కవితను తీహార్ జైల్లో పెట్టేందుకు మోడీతో KCR ఒప్పందం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
కవితను తీహార్ జైల్లో పెట్టేందుకు మోడీతో KCR ఒప్పందం: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక్కొక్కరుగా ఎదుర్కోలేకనే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూకుమ్మడిగా కాంగ్రెస్‌పై దాడికి దిగుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకు నిదర్శనమే ఇవాళ ఆ మూడు పార్టీల సభలు, కార్యక్రమాల నిర్వహణ అని ఫైర్ అయ్యారు. ఆదివారం తాజ్ కృష్ణ హోటల్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అక్రమ సొమ్ముతో ఢిల్లీ లిక్కర్ స్కాంలో పెట్టుబడులు పెట్టిన బీఆర్ఎస్.. ఆ స్కామ్‌లో వాటాలు పొందుతున్న బీజేపీ కాంగ్రెస్‌ను నిందించడం తప్ప ఇంకా ఏం చేయగలదన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్‌ను విమర్శిస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో సానుభూతి పవనాలతో ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ భావిస్తున్నారని.. ఎన్నికల్లో గెలిచేందుకు కూతురిని కూడా అరెస్టు చేయించి సానుభూతి పొందాలనుకునే వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు.

కవితను తీహార్ జైలులో పెట్టి సానుభూతి పొందాలని మోదీతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని, ఇందుకు కేసీఆర్ మోదీకి సహకరిస్తున్నారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ ఈగ వాలనివ్వడం లేదని, ఈడీ, సీబీఐ ఆయన అవినీతిపై ఒక్క కేసు కూడా పెట్టలేదన్నారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఈడీ పెట్టిన కేసులో మాత్రమే కవిత ఇరుక్కున్నారని, అంతేగాని బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒక్క కేసు కూడా పెట్టలేదని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో 100 కోట్లకే ఆప్ మంత్రులను జైలుకు పంపితే.. మరి లక్ష కోట్లు తిన్న కేసీఆర్‌ను ఉరి వెయ్యాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed