ఆ పార్టీ గెలిస్తే జరిగేది ఇదే.. : బండి సంజయ్

by Disha Web Desk 4 |
ఆ పార్టీ గెలిస్తే జరిగేది ఇదే.. : బండి సంజయ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రంలోనే కాక దేశంలోనూ టెర్రరిజం పెచ్చరిల్లే ప్రమాదం ఉందని తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ గెలవడం ద్వారా అవినీతి సొమ్మును పోగేసుకుని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కర్నాటకను ఒక ఏటీఎంలా వాడుకునే దీర్ఘకాలిక ప్లాన్ ఉన్నదన్నారు. టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించే పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో అరాచక పాలన వస్తుందన్నారు.

అభివృద్ధి కోరుకునే ప్రజలు బీజేపీకి ఓటేస్తారని అన్నారు. ముల్బగళ్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో శుక్రవారం ఎన్నికల ప్రచారం చేసిన బండి సంజయ్‌పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల మధ్య లోపాయకారీ ఒప్పందం ఉన్నదని, అందుకే కాంగ్రెస్ బలంగా ఉన్నచోట జేడీఎస్ బలహీనమైన అభ్యర్థిని నిలబెడుతున్నదన్నారు. తెలంగాణలో రామరాజ్య స్థాపన కోసం పోరాడుతున్నామని చెప్పిన బండి సంజయ్.. కర్నాటకలోనూ మరోసారి అధికారం అప్పగించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు.

కేంద్రంలో అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీ కర్నాటక రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తుందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పాతబస్తీ భాగ్యలక్ష్మీ ఆలయం దగ్గరకు రావాలంటే మజ్లిస్ నేత ఒవైసీ పర్మిషన్ తీసుకోవాలట... అక్కడ పచ్చ జెండాలను పీకించి కాషాయ జెండాను ఎగరేసిన పార్టీ బీజేపీ అని కర్నాటక ఓటర్లకు బండి సంజయ్ వివరించారు.

ఇక్కడ బీజేపీ తరపున పోటీ చేస్తున్న స్థానికుడైన సుందర్‌కు చీటింగ్, డబ్బులను మోసం చేయడం తెలియదని, విఘ్నేశ్వరుడు, ఆంజనేయస్వామి కొలువైన ఈ గడ్డపై ఎగరాల్సింది కాషాయ జెండానే అని అన్నారు. గత 70 ఏళ్లుగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు గెలిచి ఏం సాధించాయని ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టు, పరిశ్రమనైనా తీసుకొచ్చారా?.. ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. కర్నాటకలో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే డబుల్ ఇంజన్ సర్కార్‌తో ఇప్పుడు అభివృద్ధి జరుగుతున్నదని, నిధులు వస్తున్నాయన్నారు.

కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్ గెలిస్తే అభివృద్ధికి బ్రేక్ పడుతుందన్నారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రజలను దోచుకుని ఆ డబ్బును దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోసం ఖర్చు చేయాలన్నది ఆ పార్టీ ప్లాన్ అని అన్నారు. కర్నాటక రాష్ట్రాన్ని ఒక ఏటీఎంలాగా ఉపయోగించుకోవాలన్నదే దాని వెనక ఉన్న ఉద్దేశమన్నారు.

జాతీయ పార్టీ పెట్టానంటూ గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే ప్రచారం చేయకుండా, అభ్యర్థులను నిలబెట్టకుండా మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వచ్చేసారి దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగితే పాకిస్తాన్‌కు పోయి ప్రచారం చేస్తారేమో అని ఛలోక్తి విసిరారు. కాంగ్రెస్ పార్టీ కర్నాటకలో అధికారంలోకి వస్తే పీఎఫ్ఐపై నిషేధం ఎత్తేస్తామని ఆ పార్టీ లీడర్లు చెబుతున్నారని, వారిని ఉరికించి కొట్టాలన్నారు.

Next Story